ప్రొద్దుటూరు: మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు.
సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఈ సోదాలను పుట్టా సుధాకర్ యాదవ్ ఖండించారు. తన ఇంటిపై కుట్ర పూరితంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించారు.రాజకీయ కారణాలతోనే ఐటి దాడులు జరుగుతున్నాయని సుధాకర్ యాదవ్ ఆరోపిస్తున్నారు.
సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అక్కడికి వచ్చారు. ఐటి అధికారులతో సిఎం రమేష్ వాగ్వాదానికి దిగారు. సిఎం రమేష్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటి దాడులు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే మంత్రి నారాయణ నివాసంలో, నారాయణ మెడికల్ కళాశాలల్లో ఐటి దాడులు జరిగాయి. అలాగే కనిగిరి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున బరిలోకి దిగిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మరికొంత మంది టిడిపి అభ్యర్థులపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని టిడిపి అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం,నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నేతలపై దాడులు ఉండొచ్చని టిడిపి భావిస్తున్నట్టు సమాచారం.