IND v ENG : రోజు రోజుకీ ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆట తీరు మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కలవరపాటు మొదలైంది. బుమ్రా, జడేజా వంటి ప్రధాన ఆటగాళ్లు సేవలు దూరం అయినప్పటికీ భారత్ పేపర్ పై బలంగానే కనిపించింది. అయితే గ్రౌండ్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా మూకుమ్మడిగా విఫలం అవుతుండడంతో టి20 ప్రపంచకప్కు ముందు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే భారత జట్టులోకి నాలుగో టి20 కోసం ప్రధాన పేసర్ వచ్చేసాడు. ఈ మధ్యకాలంలో తన అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియా జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా స్థానం సంపాదించిన నటరాజన్ ఈరోజు నాలుగవ ట్వంటీ లో భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు అని సమాచారం. ఇప్పటికే బుమ్రా వివాహం కారణంగా అతని సేవలను టీమిండియా కోల్పోయింది. అయితే బుమ్రా లాగే నటరాజన్ కూడా యార్కర్ స్పెషలిస్ట్.
ఆస్ట్రేలియాతో సిరీస్లో బుమ్రా లేకపోయినా ఇండియా గెలవడంలో నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న హార్థిక్ పాండ్యా కూడా అప్పుడు తన ట్రోఫీని నటరాజన్ కు అందించడం గమనార్హం. అంతటి అద్భుత ప్రదర్శన చేసిన నటరాజన్ కుటుంబంతో సమయం గడిపేందుకు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత ఇంటికి వెళ్ళాడు.
ఆ తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ ఫిట్నెస్ కారణాలవల్ల బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక మూడు మ్యాచ్ ల తర్వాత నాలుగవ టీ-20 లో భారత్ తన తురుపుముక్కని ఇంగ్లాండ్ పై ప్రయోగించనుంది. నటరాజన్ వేసే యార్కర్లు, స్లో కట్టర్లను ఇలాంటి స్లో పిచ్ లపై అంచనా వేయడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి నటరాజన్ తన అద్భుత ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తాడో లేదో చూద్దాం….