IND vs ENG : టీమిండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ జట్టు గా వెలుగొందుతోంది. మూడు ఫార్మాట్లలో మొదటి మూడు స్థానాల్లో ర్యాంకింగ్లో ఉన్న ఇండియా లో తుది 11 మందిలో స్థానం దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇక దేశవాళీ క్రికెట్ లీగ్ ల వల్ల ఎప్పుడూ కుర్రాళ్ళు సెలెక్షన్ తలుపులు తడుతూనే ఉంటారు. ఇదే క్రమంలో మొన్న జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సత్తా చాటి మ్యాచ్ గెలిపించాడు.
ఇప్పుడు మొదటి రెండు టీ 20 లు పూర్తయిన నేపథ్యంలో రోహిత్ శర్మ 3 వ టీ 20 కి జట్టులోనికి రావలసి ఉంది. గత మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి అద్భుత ఫామ్ కనపరిచిన కిషన్ ను పక్కన పెట్టే అవకాశమే లేదు కాబట్టి మొదటి రెండు టి20లో ఘోరంగా విఫలమైన మరొక ఓపెనర్ కె.ఎల్.రాహుల్ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేయాలి. అయితే ట్విట్టర్లో అభిమానులు మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సిరీస్ ముందు కోహ్లీ చెప్పినట్లు భారత మొదటి ఛాయిస్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్. అంతేకాకుండా కె.ఎల్.రాహుల్ అంతర్జాతీయ టీ20ల్లో భారత క్రికెటర్లు అందరిలో కన్నా అత్యుత్తమ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్. గత ఐపీఎల్ సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్. ఒక రెండు మ్యాచ్ ల్లో ఫ్లాప్ అయ్యాడు అని చెప్పి అతని అద్భుతమైన రికార్డును పక్కన పెట్టి జట్టు నుంచి తొలగిస్తే అది జట్టు మొత్తం పైన ప్రభావం పడుతుందని అందరూ అంటున్నారు.
“రేపు నాలుగు మ్యాచ్ లు ఆడకపోతే రిషబ్ పంత్ ని కూడా పక్కన పెడతారా?” “ఆ తర్వాత కుర్రాడైన ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా అంతే ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో పూర్తిగా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని…. భయపడుతూ ఆడాల్సిన పరిస్థితి వస్తుందని అది చివరికి జట్టుకే చేటు అవుతుందని అంటున్నారు. మరి టీం మేనేజ్మెంట్ ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.