ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. పుజారా 130 పరుగులతోనూ, హనుమవిహారి 39 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యతతో ఉన్న భారత్ ఈ టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం లభించలేదు. స్కోరు బోర్డుపై పది పరుగులు కూడా లేకుండానే ఓపెనర్ లోకేష్ రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ఈ తరువాత మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారాలు సెంచరీ పార్టనర్ షిప్ తో పరిస్థితి చక్కదిద్దారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కహ్లీ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నాడు.కోహ్లీ 23 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్యారాహానే కూడా18 పరుగులకు ఔటై పెవిలియన్ చేరాడు. అక్కడ నుంచి హనుమ విహారితో కలిసి మరో వికెట్ పడకుండా ఛటేశ్వర్ పుజారా రోజు ముగించాడు. ఈ క్రమంలో పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటముగిసే సరికి 130 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హనుమ విహారి 39 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. బౌన్సీ పిచ్ అటు పేస్ కు ఇటు స్పిన్ కూ కూడా సహకరిస్తున్న నేపథ్యంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో మరో 50 పరుగులు చేసినా పటిష్ట స్థితికి చేరుకున్నట్లే భావించాల్సి ఉంటుంది.