సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు సరైన రీతిలో బుద్ది చెప్పేందుకు భారత్ సన్నద్ధం అవుతున్నది. లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశం తరువాత అయినా భారత్ -చైనా వివాదం పరిష్కారం అవుతుందని అందరూ భావించినా కానీ ఆ సమావేశం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఈ సమావేశంలో.. ఏప్రిల్ చివరి నాటికి ఏ విధంగా ఇరు దేశాలు ఉన్నాయో ప్రస్తుతం అదే విధంగా ఉండాలని భారత్ ప్రతిపాదించగా అందుకు చైనా అంగీకరించపోగా చైనా భారత్ సరిహద్దుల్లో చేపట్టిన రోడ్లు, ఇతర నిర్మాణాలను ఆపేయాలని పట్టుబట్టింది.
దేప్పాంగ్ – గల్వాన్ లోయకు మధ్య సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా వ్యతిరేకిస్తున్నది. తమ భూభాగంలో నిర్మాణాల గురించి చర్చలు జరపడం ఏమిటని చైనాను భారత్ ప్రశ్నించింది. చైనా – భారత్ అధికారుల మధ్య తొలి దశ చర్చలు ఫలప్రదం కాకపోవడంతో మరో దఫా చర్చలు తప్పవని నిపుణులు భావిస్తున్నారు.
మరో వైపు చర్చలు విఫలం కావడంతో చైనా బరితెగించింది. తాజాగా సరిహద్దుల్లో బలగాలను మోహరించి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సరిహద్దులో సైన్యాన్నీ మోహరించి చైనా కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్ కూడా భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందటంతో సరిహద్దు ప్రాంతాలలో భారత్ కాపలాను ముమ్మరం చేసింది.
మరో వైపు ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
సాధ్యమైనంత త్వరగా భారత్ – చైనా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.