కరోనా నేపథ్యంలో భారత్లో మార్చి 25 నుంచి లాక్డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. మే 31వ తేదీ వరకు లాక్డౌన్ను అమలు చేశారు. తరువాత అన్లాక్ ప్రక్రియను మొదలు పెట్టారు. అదే సమయంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. అప్పటి నుంచి కేసుల సంఖ్య నిత్యం భారీగా పెరుగుతుంది కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఇదే విషయంపై నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ వెబినార్లో పాల్గొన్న ఆయన లాక్డౌన్ నిర్ణయం మంచిదే కానీ.. దాన్ని సరైన సమయంలో అమలు చేయలేదన్నారు.
భారత్లో మార్చి 25 సమయంలో కరోనా కేసులు ఎక్కువగా లేవని.. అలాంటి సమయంలో లాక్డౌన్ పెట్టడం సరికాదని అభిజిత్ బెనర్జీ అన్నారు. మరీ త్వరగా లాక్డౌన్ పెట్టారని అన్నారు. ఇక కేసులు భారీ పెరుగుతున్న సమయంలో లాక్డౌన్ను తీసేశారని అన్నారు. అది కూడా సరైన నిర్ణయం కాదన్నారు. లాక్డౌన్ను కొంత ఆలస్యంగా పెట్టి.. ఇంకాస్త ఆలస్యంగా తీసేసి ఉంటే బాగుండేదని.. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి తక్కువగా ఉండేదన్నారు. లాక్డౌన్ను మరీ త్వరగా తీసేయడం వల్ల కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు.
లాక్డౌన్ను దీర్ఘకాలం పాటు అమలు చేయలేమని.. కానీ కేసుల సంఖ్య భారీగా ఉన్న సమయంలో అమలు చేయాల్సి ఉండేదని అన్నారు. దీంతో కరోనా కేసులు ఇప్పటి కన్నా ఇంకా తక్కువగానే నమోదయ్యేవన్నారు. సరైన సమయంలో లాక్డౌన్ను అమలు చేయకపోవడం వల్లే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు మార్చి 25 లాక్డౌన్ను ప్రకటించాక.. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయని.. అలా కాకుండా ప్రణాళికతో కొంచెం ఆలస్యంగానైనా లాక్డౌన్ను పెట్టి ఉంటే బాగుండేదన్నారు.