(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇంత తీవ్రమైన వడగాలులు దేశంలో గతంలో ఎప్పుడూ రాలేదు. ఉత్తర భారతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దక్షిణ భారతంలో కూడా చాలా ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. ఉత్తరాదిన నాలుగు నగరాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజధాని ఢిల్లీలో సోమవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాజస్థాన్లోని చురు పట్టణంలో రికార్ఢు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 48.9డిగ్రీలు, బాందాలో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఉష్ణోగ్రతలు రెండు రోజులకు మించి 45 డిగ్రీలు కొనసాగితే వడగాడ్పు ప్రకటిస్తారు. 47 డిగ్రీలు నమోదయితే తీవ్రస్థాయి కింద లెక్కిస్తారు. కొద్ది సంవత్సరాలుగా వడగాడ్పులు తరచూ వస్తున్నాయి. వాతావరణం రికార్డులు భద్రపరచడం 1901లో మొదలయింది. అప్పటినుంచీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయిన 15 సంవత్సరాలలో 11 సంవత్సరాలు 2004 తర్వాతే వచ్చాయి. గత వారంలో ప్రపంచంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయిన 15 ప్రాంతాలలో 11 ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. 2010 తర్వాత దేశంలో వడగాల్పులకు ఆరు వేల మంది మరణించారని లోక్సభలో మంత్రి చెప్పారు.