బెంగళూరు, జనవరి 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో ‘గగన్యాన్ ప్రాజెక్టు’ ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఇస్రో చైర్మన్ కె శివన్ అన్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 2021 డిసెంబర్ నాటికి భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం వల్ల స్వతంత్రంగా మనుషులను పంపిన నాల్గవ దేశంగా భారత్కు ఘనత దక్కుతుందని అయన అన్నారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోది గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తూ, 2022 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారనీ, అయితే తాము డిసెంబర్ 2021 నాటికే పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామనీ శివన్ తెలిపారు.
గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు ముందుగా భారత్లో తరువాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపుతామని, బృందంలో మహిళ కూడా ఉంటారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం పది కోట్లు కేటాయించిందనీ, ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుందని అయన వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్లో చంద్రుడిపైకి ‘చంద్రయాన్ -2’ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శివన్ తెలిపారు.