ముంబాయి, ఫిబ్రవరి 20: ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్లో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్పై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో నీలి నీడలు అలుముకున్నాయి. రెండు పాయింట్లు కోల్పోయినా ఫర్వాలేదు, పాక్తో మ్యాచ్ ఆడరాదని భారత్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జూన్ 16న మాంచెస్టర్లో జరగాల్సిన ఈ మ్యాచ్పై బిసిసిఐ అలోచనలో పడింది. దీనిపై బోర్డు సభ్యులు చర్చించినట్లు సమాచారం. ప్రపంచ కప్లో పాక్తో భారత్ ఆడాలా వద్దా అనే దానిపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బోర్డు అధికారి ఒకరు చెప్పినట్లు ఎన్డి టివి తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం పాక్తో మ్యాచ్ వద్దంటే తప్పక పాటిస్తామని ఆ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు అయితే ఈ మ్యాచ్ గురించి ఐసిసితో చర్చించాలని అనుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, అభిమానుల అభీష్టం మేరకే బిసిసిఐ నడుచుకుంటుందని చెప్పారు.
ఈ విషయంపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చనీ, ప్రపంచ కప్కు కొద్ది రోజుల ముందు ఇది తేలుతుందని బిసిసిఐ అభిప్రాయపడింది.
పాకిస్తాన్తో భారత్ క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలన్న డిమాండ్ న్యాయబద్ధమయిందేనని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. టీమిండియా క్రికెటర్ హర్బజన్ సింగ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.