యూరప్ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం నుండి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకూ కొన్ని నెలల పాటు ఆంక్షలు ఉంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకె నుండి విమానాల రాకపోకలను ఇప్పటికే నిషేదించగా తాజాగా భారత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ 31వ తేదీ వరకూ ఇండియా – బ్రిటన్ ల మధ్య విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది, విమానాల రద్దును రేపు అర్థరాత్రి నుండి అమలు చేయనున్నది. బ్రిటన్ నుండి భారత్ కు వచ్చిన వారిని వారం రోజుల పాటు క్వారంటైన్ విధించనుంది. అంతకు ముందు ఢిల్లీ సీఎం, అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై నిషేదం విధించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇర్లాండ్, కెనడా, నెదర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా, స్వీడన్ సహా 19 దేశాలు యూకెకి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి.