దేశవ్యాప్తంగా నిత్యం దాదాపుగా లక్ష వరకు కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం శుక్రవారం వరకు భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. అయితే అక్టోబర్ మొదటి వారం వరకు భారత్ కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేరుకుంటుందని నిపుణుల అంచనాల్లో వెల్లడైంది.
ప్రస్తుతం 65,88,825 కరోనా కేసులతో అమెరికా కరోనా కేసుల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, భారత్ 45,66,726 కేసులతో రెండో స్థానంలో ఉంది. అయితే అక్టోబర్ మొదటి వారం వరకు భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరుకుంటుందని నిపుణుల బృందం అంచనా వేసింది. ఈ క్రమంలో కరోనా కేసుల విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికాను కిందకు తోసి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే మరోవైపు మరణాల పరంగా చూస్తే అమెరికా, బ్రెజిల్ దేశాల కన్నా ఇండియానే మెరుగైన స్థితిలో ఉంది. ఆయా దేశాలతో పోలిస్తే భారత్లోనే కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి. అమెరికాలో కరోనా వల్ల ఇప్పటి వరకు 1,96,345 మంది చనిపోగా, బ్రెజిల్లో 1,29,575 మంది చనిపోయారు. భారత్లో 76,336 మంది చనిపోయారు. కాగా పైన తెలిపిన అంచనాలను హైదరాబాద్లోని బిట్స్ పిలానీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు వారు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి భవిష్యత్తులో నమోదు కానున్న కరోనా కేసుల సంఖ్యను ఉజ్జాయింపుగా లెక్కించి పై వివరాలను తెలియజేశారు.