న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకూ భారత్ – పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగే అవకాశం లేదని ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు.
జమ్ము, కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘భారత్ – పాక్ దైపాక్షిక మ్యాచ్లపై మా తీరు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఒప్పుకునే వరకూ పాక్తో టీమిండియా ఆడదు. అన్ని అంశాలకు అతీతంగానే క్రీడాస్పూర్తి ఉండాలి కానీ ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపై కూడా పడుతుంది’ అని రాజీవ్ శుక్లా అన్నారు.
ప్రపంచ కప్లో పాకిస్థాన్తో భారత్ ఆడే అవకాశాలు ఉన్నాయా అన్న అంశంపై ‘ఇప్పుడే ఏమీ చెప్పలేము, ప్రపంచ కప్ మ్యాచ్కు చాలా సమయం ఉంది. ఏం జరుగుతుంతో చూడాల్సిందే. ఉగ్రదాడిపై భారత్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని రాజీవ్ శుక్లా చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రపంచ కప్లోనూ పాక్తో భారత్ ఆడవద్దని డిమాండ్ వస్తున్నది.