Delhi: ఢిల్లీ అనగానే మనకు గుర్తొచ్చేది కాలుష్యం. కాలుష్య కోరల్లో ప్రస్తుతం దేశ రాజధాని విలవిల్లాడుతోంది. ఎన్ని చర్యలు చేపట్టినా కానీ ఢిల్లీ కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. కాలుష్య కోరల్లో ఢిల్లీ వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అనవసరంగా ప్రభుత్వాలు వద్దన్న పనులు చేయడం వలనే ఇలా కాలుష్య కోరల్లో ప్రజలు చిక్కుకున్నారని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.
ఈవీలే సమాధానమా…
పెరిగిపోతున్న కాలుష్య రక్కసిని కంట్రోల్ చేసేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) మంచి పరిష్కారంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి అనేక విధాలుగా రాయితీలు అందించి ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న ఆయిల్ ధరలను చూసి కూడా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిదానంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోడ్ల మీద పెరుగుతోందని అధికారులు కూడా ప్రకటిస్తున్నారు.
ఆ నిర్ణయంతో ఉపశమనం…
ఢిల్లీలో పదేళ్లకు పైబడిన వాహనాలు రోడ్ల మీదకు రాకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో అనేక మంది సామాన్య ప్రజలు అంత ఖర్చు పెట్టి బండిని కొని కేవలం పదేళ్లకే పక్కకు పారేయాలా అని చాలా తర్జనభర్జన పడ్డారు. అయినా కానీ ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చింది. దీంతో అనేక మంది వాహనదారులు చేసేదేం లేక తమ వాహనాలను పక్కన పెట్టారు. కానీ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన అనేక మంది వాహనదారులకు ఊరట లభించనుంది. పదేళ్లు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఎలక్ట్రిక్ వాహనం ఇంజిన్ ను అమర్చుకుని వాడుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ మాట్లాడుతూ… ఈ విధానంపై త్వరలో రవాణా శాఖ తరఫున పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించారు.