(న్యూఢిల్లీ నుండి “న్యూస్ అర్బిట్” బ్యూరో)
కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు భారతదేశంలోని అన్ని రంగాలపై పడింది అన్న విషయం తెలిసిందే. అనేక రంగాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా కనబడటం లేదు. భారత దేశం జిడిపి మొదటి క్వార్టర్ లో సుమారు 24 శాతం పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 10 శాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటు పడిపోతుంది వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఒక రంగం మాత్రం చాలా వేగంగా పుంజుకుంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏమిటా రంగం, ఎలా పుంజుకుంది. కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
భారతదేశంలో ఐ టి రంగం మాత్రం ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటుందని అధ్యయనాలు చెబుతుండటం చాలా సంతోషకరమైన విషయం. ఐటి రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది యువతీ యువకులు ఇది ఒక శుభ వార్త. ఐటి రంగం వేగంగా పుంజుకోనున్నది అని బిజినెస్ లైన్ పత్రిక ఒ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఐటి పరిశ్రమలు ఎక్కువగా ఇతర దేశాల క్లైయింట్ లపై ఆధారపడి పని చేస్తుంటాయి. ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభం నుండి వేగంగా పుంజుకోవడం వల్ల ఐటి రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల ఆ రంగం త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆర్థిక సంక్షోంభం నుండి యూరప్, అమెరికా దేశాలు వేగంగా కోలుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆయా దేశాలలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మార్చి నెలలో రెండు లక్షల కోట్ల డాలర్ ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. అదే విధంగా ఏప్రిల్ నెలలో 48వేల కోట్ల డాలర్ ల ప్యాకేజీ ఇచ్చారు. మొత్తంగా రెండున్నర లక్షల కోట్ల డాలర్ ల ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీని అందజేశారు. అలానే యుకేతో పాటు ఇతర యూరపియన్ దేశాలలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం వల్ల ఆయా దేశాలలో ఆర్థిక పరిస్థితి వేగంగా పుంజుకుంటోంది. దీనికి తోడు బ్యాంకుల ద్వారా కంపెనీలకు తక్కువ వడ్డీకి సులభతరంగా పెద్ద ఎత్తున రుణాలు అందించే అవకాశం కూడా కల్పించారు. దీంతో అక్కడి ఐటి రంగంలోకి పెట్టుబడులు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. అయా దేశాలలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం వల్ల ఆ దేశాలపై ఆధారపడి ఉన్న ఐటి పరిశ్రమలు అన్నీ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులు పడతాయి.