Baba Ramdev: యోగా గురుబాబా రాందేవ్ అల్లోపతి(ఇంగ్లీష్) వైద్యానికి సంబంధించి,డాక్టర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేరుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. జలంధర్ పోలీసులకు కూడా రామ్ దేవ్ పై ఫిర్యాదు అందింది.
అసలేం జరిగిందంటే!
తాజాగా బాబా రాందేవ్ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.అందులో అల్లోపతి వైద్యాన్ని రాందేవ్ అవహేళన చేశారు.అల్లోపతి అనేది ఒక పనికిరాని సైన్స్ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు.అల్లోపతి మందులు తీసుకున్న లక్షలాది మంది కోవిద్ రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.భారత డ్రగ్ కంట్రోలర్ ఆమోదించిన రెమిడిసీవర్,ఫావి ఫ్లూ వంటి మందులు కూడా కూడా కరోనాను నయం చేయలేకపోయాయని రాందేవ్ అన్నారు.అంతకుముందు మరో సందర్భంలో రాందేవ్ వైద్యులనుద్దేశించి ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమంది.
రాందేవ్ ను ప్రాసిక్యూట్ చేయాలి!
అల్లోపతిని, ఆ కేటగిరికి చెందిన వైద్యులను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) వాపోయింది. ఇది ఆయనకు కొత్త కూడా కాదంటూ శనివారం ఒక ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఈ సందర్బంలో ఐఎంఏ రాందేవ్ బాబాపై కొత్త ఆరోపణ కూడా చేసింది.ఎటువంటి అనుమతులు లేని తను తయారుచేసిన ఆయుర్వేదం,హెర్బల్ మందులను ఇతర ఉత్పత్తులను అమ్ముకోవడానికి వాటికి డిమాండ్ పెంచుకునేందుకే బాబా రామ్దేవ్ అల్లోపతి మీద ఆ రంగంలో ఉన్న వైద్యుల మీద ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఐఎంఎ పేర్కొంది. కరోనా కాలంలో ఎన్నో ఒడుదొడుకులకు గురవుతూ, వైద్యులు శ్రమిస్తుంటే ఈ విధమైన నిందలు తగవని ఆ ప్రకటనలో పేర్కొంది.బాబా రాందేవ్పై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేయాలని, లేదంటే ఆధునిక వైద్య శాస్త్రాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఐఎంఏ నాయకులు కోరారు. కేంద్రం చర్యలు తీసుకోని పక్షంలో తాము న్యాయస్థానం తలుపులు తడతామమని కూడా ఐఎంఏ హెచ్చరించింది.సమాజంలో మంచి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, రోగుల మనోస్థైర్య౦ దెబ్బతీంటుందని అన్నారు.
పోలీసులకు కూడా ఫిర్యాదు!
మరోవైపు యోగా గురు బాబా రాందేవ్ మీద పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.ఐఎంఎ ఉపాధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ దహియా వైద్యులనురాందేవ్ కించపరిచేటట్లు మాట్లాడుతున్నారని వారిపై ప్రజలకు అపోహలు కలిగించే ప్రకటనలు చేస్తున్నారంటూ జలంధర్ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు.రామ్ దేవ్ పై తక్షణం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మొత్తం మీద ఈ వివాదం ముదిరిపోయింది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
కొసమెరుపు
అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే ‘వారికి సరిగా శ్వాస తీసుకోవడం కూడా రావట్లేదు’ అంటూ కరోనా రోగులను ఈ బాబా గారు ఎద్దేవా చేశారు.ఇవన్నీ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యల్లాగ ఉన్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.