ఢిల్లీ : రైలు టికెట్లపై ప్రధాని మోది బొమ్మల వివాదం సమసిపోకముందే ఇండియన్ రైల్వేస్కు మరో సమస్య తలనొప్పిగా మారింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మై భీ చౌకీదార్ పేరుతో ఉన్న టీ కప్పుల్లో ప్రయాణికులకు తేనీరు అందిస్తున్నారు. ఈ వ్యవహారం కాఠ్గోదామ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్లో వెలుగుచూసింది.
ఈ అడ్వర్టైజ్మెంట్ సంకల్ప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వేయించినట్లు కప్పు మీద రాసి ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది.
మరోవైపు టీ కప్పులపై ప్రదర్శితమవుతున్న మై భీ చౌకీదార్ కాంపెయిన్పై ఐఆర్సిటిసికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టామని ఐఆర్సిటిసి ప్రతినిధి తెలిపారు. సర్వీస్ కాంట్రాక్టర్కు లక్ష రూపాల జరిమానా విధించామని, షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా రైలు టికెట్లపై మోది ఫొటో ఉండటంపై కేంద్రానికి నోటీసులిచ్చిన ఈసి తాజా ఘటనపై ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.