కరోనా మహమ్మారి వలన పర్సనల్ వర్క్ అయినా, ఆఫీస్ వర్క్ అయినా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్న రోజులివి. జస్ట్ చేతిలో ఒక్క మొబైల్ ఉంటే చాలు అనే అంతగా ఆ గ్యాడ్జెట్పై జనం ఆధారపడ్డారు. మొబైల్ ఫోన్ వలన ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వ్యక్తి అయినా ఉన్నచోటు నుంచే మరొకరితో కనెక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీ సాయంతో కమ్యూనికేషన్ చాలా తేలిక అయిపోయింది.
మనుషులు చాలా తేలికగా ఇంటరాక్ట్ అవుతున్నారు. దీనివల్ల మనుషులు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశమే లేకుండా అయిపోతుంది. అయితే ఇటీవల జరిగిన సర్వే లో ఇండియాలో సగం మంది “మొబైల్ ఫ్రీ” టైమ్ కోరుకుంటున్నారని తేలింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు మొబైల్ లేని సమయం వారు కావాలనుకుంటున్నారు.
ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, హాంకాంగ్, జపాన్, మెక్సికో, బ్రిటన్, యూఎస్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ కలిసి ‘లివ్ లైఫ్’ అనే సర్వేను నిర్వహించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి 14 వరకు ఇండియాలో రెండువేల మందితో ఆన్లైన్ ద్వారా ఈ సర్వేను నిర్వహించారు. ఆ సర్వే లో గత రెండేళ్లలో తమ ఉద్యోగాల కోసమే తమ సమయాన్ని ఎక్కువగా కేటాయించామని 33 శాతం మంది చెప్పారు. వారిలో 38 శాతం మంది ఇందుకు టెక్నాలజీయే ముఖ్య కారణమన్నారు.
ఇందులో పెద్దవారికంటే యువకులే మొబైల్ ఫ్రీ టైమ్ కోరుకోవడం విశేషం. తమిళనాడులో 90 శాతం మంది అన్నింటికన్నా మానవసంబంధాలకే ఎక్కువ విలువ ఇస్తామని స్పందించడం విశేషం. ఈ సర్వే ఆధారంగా గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిన వాళ్లలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని అర్థమవుతోంది. యువత లో టెక్నాలజీ కన్నా మానవసంబంధాలే మిన్న అన్న ఆలోచన పెరుగుతోంది.