బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా మగువలు బంగారు ఆభరణాలు ధరించడానికి చూపించే చొరవ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారు ఆభరణాలు మహిళ అందాలను పెంచడమే కాదు.. వ్యాపారులకు సైతం కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే, మార్కెట్ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ.. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెళ్లిల్లు, పండగ సీజన్ వచ్చిందంటే బంగారం క్రయవిక్రయాలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. మాములుగా బంగారం డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
అయితే , కరోనా సంక్షోభం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం డిమాండ్ భారీగా పడిపోయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2019 తో పోలిస్తే.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ రికార్డు స్థాయిలో 30 శాతం క్షీణించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యు జీ సీ) నివేదిక తెలిపింది.
2019 జులై -సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్123.9 టన్నులుగా ఉంటే, ప్రస్తుతం 86 టన్నులుగా ఉంది. జ్యూవెల్లరి డిమాండ్ కూడా రికార్డ్ స్థాయిలో 48 శాతం పడిపోయింది. దేశీయ మార్కెట్లో నే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.