పనాజి: గోవా నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 180 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. వెంటనే పైలెట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్లో మంటలు చెలరేగాయని మంత్రి నీలేశ్ కాబ్రాల్ తెలిపారు. దీన్ని గమించిన పైలెట్లు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని చెప్పారు. తనతో సహా విమానంలో ఉన్న 180 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మంత్రి కాబ్రాల్ వివరించారు.