హైదరాబాద్: కృష్ణాజిల్లాకు చెందిన ఐరన్ ట్రేడింగ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
శనివారం రాత్రి రాంప్రసాద్ పంజాగుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్ను సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేటి తెల్లవారుజామున మృతి చెందారు.
రాంప్రసాద్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయవాడ కొండపల్లి సమీపంలో కోగంటి సత్యంకు చెందిన కామాక్షి స్టీల్ ప్లాంట్లో గతంలో రాంప్రసాద్ భాగస్వామిగా ఉన్నారు. వ్యాపార భాగస్వామి కోగంటి సత్యంతో పాతకక్షలు ఉన్నాయనీ, అతని నుండి తరచు బెదిరింపులు వచ్చేవని, ఆయనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉంటారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోగంటి సత్యంపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు.కామాక్షి స్టీల్స్లో తనతో పాటు బొండా ఉమా కూడ వ్యాపార భాగస్వామిగా ఉన్నారనీ, ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆయన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్కు విక్రయించారని కోగంటి చెప్పారు. 2013లో రాంప్రసాద్ స్ర్కాప్ సప్లై చేసిన కొంత మందికి, కంపెనీకి సుమారు 70కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయాడని కోగంటి సత్యం తెలిపారు. తనకే 23కోట్ల రూపాయలు అతని వద్ద నుండి రావాల్సి ఉందని సత్యం అన్నారు. ఆయన్ను హత్య చేయిస్తే తనకు రావాల్సిన డబ్బు ఎలా వస్తుందని కోగంటి ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే టిడిపి వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కోగంటి ఆరోపించారు. తనపై 19కేసులు ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోందనీ, అది నిజం కాదనీ, మూడు కేసులు మాత్రమే ఉన్నాయని కోగంటి తెలిపారు. మూడు రోజుల క్రితం తాను తిరుపతి వెళ్లాననీ అక్కడ నుండి చికిత్స కోసం హైదరాబాదుకు తిరిగి వచ్చినట్లు కోగంటి తెలిపారు. రాంప్రసాద్ను తాను ఏనాడూ కూడ బెదిరించలేదని ఆయన చెప్పారు. రాంప్రసాద్ హత్య విషయంలో పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని కోగంటి పేర్కొన్నారు.