అమరావతి, డిసెంబర్ 29: పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి మూలం మౌలిక రంగమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఇంధనం, మౌలిక రంగాలపై శ్వేతపత్రం విడుదల చేసారు. ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం, ప్రజలకే అంకితం పేరుతో సమాచార శాఖ విడుదల చేసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళలో సాధించిన విజయాలపై సమాచార శాఖ ముద్రించిన కరదీపిక ఇది. అమరావతితో సహా మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రహదారులు-భవనాలు, ఆర్థిక నగరాలపై ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నామన్నారు. 1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నాం. 2004 నుంచి 2014 వరకు దశాబ్దం పాటు విద్యుత్ రంగంలో చీకట్లు. ఆ తరువాత అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల విద్యుత్ రంగం మరింత కష్టాల్లోకి వెళ్ళింది. విభజన తరువాత మళ్లీ ఇంధన రంగంపై దృష్టి పెట్టాం. తక్కువ కాలంలోనే మిగులు విద్యుత్ సాధించాం. అనేక నూతన విధానాలు, కార్యక్రమాలు చేపట్టాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టాం. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించాం, స్వల్పకాలంలోనే మిగులు విద్యుత్ సాధించాం. గ్రామాలలో ఇప్పటికే 20 లక్షల వీధిలైట్లు అమర్చాం. జనవరి నాటికి అన్ని వీధి లైట్లను ఎల్ఈడీలతో మార్చేస్తాం. 2018-19 సంవత్సరానికి విద్యుత్ రంగానికి రాయితీల కింద 6,030 కోట్లు కేటాయించాం. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ రంరంలోనే 138 పురస్కారాలు రావడం విశేషమని పేర్కొన్నారు.
previous post
next post