మహారాష్ట్ర – కర్ణాటక మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ శిండే, బసవరాజు బొమ్మై లు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి సమస్యపై చర్చించారు. ఈ వివాదం సుప్రీం కోర్టులో ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజల సమన్వయంతో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారు. అయితే ఈ సరిహద్దు వివాదం శాశ్వత పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక సూచనలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన సరిహద్దు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని, అప్పుడే సమస్య కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు ఉద్దవ్ ఠాక్రే శాసనమండలిలో నిన్ని ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక – మహారాష్ట్ర మధ్య నెలకొన్నది భాష, సరిహద్దు వివాదం మాత్రమే కాదనీ, మానవత్వానికి సంబంధించిన సమస్య అని ఉద్దవ్ పేర్కొన్నారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారని, ఈ వివాదం ఇప్పటికీ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంత వివాదం జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు ఉద్దవ్. అటు పక్క కర్ణాటక ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేస్తుంటే.. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పలేదన్నారు. యథాతథ స్థితిని కొనసాగించాల్సిన గ్రామాల్లో ఎవరు చిచ్చురేపుతున్నారని ఉద్దవ్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన కేంద్రం ఏమి చేస్తొందని ఉద్దవ్ ప్రశ్నించారు. తాము మాత్రం కేంద్ర సంరక్షక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉభయ సభల సభ్యులు కేస్ ఫర్ జస్టిస్ సినిమాను వీక్షించాలనీ, మహాజన్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయాలని ఉద్దవ్ సూచించారు.
కర్ణాటకలోని బెలగాని మున్సిపల్ కార్పోరేషన్ తమను మహారాష్ట్రలో కలిపివేయాలని తీర్మానం చేస్తే కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు ఉద్దవ్. మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునే సాహసం శిండే ప్రభుత్వం చేయలేకపోతున్నదని ఉద్దవ్ విమర్శించారు. ఉద్దవ్ సూచనలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.