నేటి తరం యువతలో ప్రేమ పేరు చెప్పి మోసం చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే రోజూ సమాజంలో జరుగుతున్న సంఘటనలు కూడా అలాగే ఉంటున్నాయి మరి. ప్రేమిస్తున్నాం అని చెప్పి కావాల్సినన్ని రోజులు వాడుకోవడం ఆ తర్వాత ప్రేమించిన వారిని మోసం చేయడమే మనం చూస్తున్నాం. ఈ తరహా సంఘటనలు మన నిత్య జీవితంలో ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. అయితే, తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుందాం అని చెప్పి గుడికి రమ్మన్న ప్రియుడి మాటలు నమ్మి గుడికి వెళ్ళింది ప్రియురాలు. తీరా గుడికి వెళ్ళాక ఎంత సేపు ఎదురు చూసినా తన ప్రేమికుడు రాలేదు. తీరా సమయం రాత్రి 9 గంటలు దాటుతున్న అతను రాలేదు. ఎదురు చూసి చూసి చివరికి తాను మోసపోయానని గ్రహించింది ఆ యువతి. ఇంటికి వెళదాం అనుకున్న ఆమెకి ఎలా వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో 100కి డయల్ చేసింది. ఆమె ఫోన్ కాల్ కి వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శామీర్పేట మండలం కి చెందిన యువతి మేడ్చల్ సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువకుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ఇరువురి ఇళ్లల్లో తెలిస్తే తమ ప్రేమని ఒప్పుకోరని భావించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట గుడిలో ఉదయం పది గంటలకు పెళ్లి చేసుకుందామని ప్రియుడు చెప్పగా ప్రియురాలు నమ్మి గుట్ట వద్దకు చేరుకుంది.
వర్గల్ మండలం ఏఎస్సై మధుసూదనరావు పెట్రోలింగ్ విధుల్లో ఉన్న బ్లూకోల్ట్ సిబ్బంది ఆమె ఫోన్ కాల్ తో వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. పోలీసులు యువతి వివరాలు ఆరా తీసి క్షేమంగా ఆమెను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు.