అధికార వైఎస్సార్ సీపీలో జగన్ తర్వాత ఎవరు అంటే ఠక్కున చెప్పే సమాధానం.. విజయసాయి రెడ్డి అని! జగన్ వ్యాపారాలు మాత్రమే చేసుకునే రోజులకుముందు నుంచి కూడా విజయసాయితో జగన్ కు మంచి అవినాభావ సంబదమే ఉంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఢిల్లీ పనులు చక్కబెట్టడంలో కూడా సాయిరెడ్డే కీలక భూమిక పోషించేవారని చెబుతారు. ఆ సంగతులు అలా ఉంటే… అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ బంధానికి బీటలు వారుతున్నాయనే వార్తలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి జగన్ విశాఖకు వెళ్లిన సమయంలో.. కారులో నుంచి సాయిరెడ్డిని దింపేశారు అన్న వార్త అప్పట్లో సంచలనం. అది ప్రోటోకాల్ లో భాగంగా జరిగిందని తర్వాత క్లారిటీ ఇచ్చినా నమ్మేవారు నమ్మారు, నమ్మని వారు నమ్మలేదు. దీంతో… స్వయంగా సాయిరెడ్డే మైకులముందు వచ్చి.. జగన్ తోనే చివరివరకూ అన్న స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాటి నుంచి సాయిరెడ్డి పై జగన్ కాస్త సీరియస్ గానే ఉన్నారన్న కథనాలు తెగ వచ్చి చేరుతున్నాయి.
కేవలం పార్టీ వ్యవహారాల్లోనే కాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా సాయిరెడ్డి వేలు పెడుతున్నారని, ఈ విషయంపై కొందరు మంత్రులు సీఎం వద్ద ప్రస్థావించారని గుసగుసలు వినిపిస్తున్నాయి! ఎమ్మెల్యేల మీద పెత్తనం చేయడం అంటే.. పార్టీ అధికారంలో భాగమనుకోవచ్చు కానీ.. మంత్రులపై పెత్తనం అనేది ప్రభుత్వ అధికారంలో భాగమైపోతాది కాబట్టి… నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని అంటున్నారట. ఇక తాజాగా రఘురామకృష్ణం రాజు కూడా మాటకి ముందోసారి మాట తర్వాతోసారి సాయిరెడ్డి పేరు ప్రస్థావిస్తుండటం కూడా జగన్ కు తలపోటుగా మారిందని అంటున్నారు. దీంతో… సాయిరెడ్డిపై వైకాపా నేతలు ఎవరైనా, ఎప్పుడైనా… రఘురామకృష్ణం రాజు మాదిరిగానే బ్లాస్ట్ అయ్యే అవకాసాలున్నాయని అంటున్నారు.