58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి … రాష్ట్రము కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తిగా ఎప్పటికి పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోతారు.. అసలు ఆయన త్యాగం దేని కోసం?? అన్ని రోజులు నిరాహారదీక్ష చేసినా ఆయన డిమాండ్ ఎందుకు నెరవేర్చలేకపోయారు?? పొట్టి శ్రీరాములు మృతికి కారణాలు ఏంటి?? ఆయన మృతి తర్వాత ఎం జరిగింది ?? అనే దానిపై రకరకాల వాదనలు, ప్రచారాలు ఉన్నా చరిత్రలో నిలిచే సాహసం చేయడంలో మాత్రం పొట్టి శ్రీరాములు ఎప్పటికి గుర్తుండిపోతారు…. ఈ రోజు ఆయన వర్ధంతి… అసలు పొట్టి శ్రీరాములు కోరుకున్నది ఏంటీ..? జరిగింది ఏంటి? ఒకసారి స్మరిద్దాం రండి…
** 1950 నాటికీ భాష రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ సమస్య. అప్పటికే అది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. స్వతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం తరఫున నిర్మాణ కార్యక్రమ ఆర్గనైజరుగా శ్రీరాములు పనిచేశారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రులకు ప్రత్యేకంగా రాష్ట్రం లేకపోవటం వల్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు.
** గాంధీ సిద్ధాంతాలతో బాగా ప్రభావితం అయినా శ్రీరాములు అదే మార్గంలో దీక్ష చేయాలని నిర్ణయించారు. మద్రాసు నగరాన్ని కేంద్ర పాలిత రాష్ట్రంగా ఏర్పరచడానికి మొదట ఈ దీక్ష జరిగింది అని ఎక్కువ మంది భావించారు. 1952 అక్టోబరు 19వ తేదీన శ్రీరాములు దీక్షకు కూర్చున్నారు.
దీక్షను విరమించడానికి రెండు షరతులు పెట్టారు.
1) మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం ఏర్పడటం.
2) భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటం.
** మద్రాసు నగరం ఉమ్మడి సొత్తుగా తెలుగు , తమిళులు ఉమ్మడి నగరం చేస్తే బాగుంటుందని పొట్టి శ్రీరాములు భావించారు. మరి నిర్వివాద ప్రాంతాలతో చాలామంది రాష్ట్రం కావాలంటున్నారు కదా! అంటే.. ‘మనం మద్రాసు ఎందుకు వదులుకోవాలి? వేరేచోటకు వెళ్లి మట్టిలోను, ఇటుకల్లోను రూ. 15-20 కోట్లు ఎందుకు పోసుకోవాలి? ఇంత డబ్బు ఎందుకు వృధా చెయ్యాలి? త్వరగా రాష్ట్రం వస్తుందని ఉన్న హక్కు ఎవరైనా వదులుకుంటారా? అసలు ఆ మాటకు వస్తే మద్రాసుపై మనకు ఎక్కువ హక్కు ఉంది. ఇదంతా గుర్తించే ధార్ కమిటీ మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని న్యాయంగా తీర్పు చెప్పింది అని ఆయన చెప్పేవారు.
** మొదటి రోజు 53 కేజీలు.. చివరి రోజు 38 కేజీలు
దీక్షా కాలంలో శ్రీరాములు పాటించిన దిన చర్యను డాక్టర్ కస్తూరి నారాయణ మూర్తి, డాక్టర్ అవధాని, డాక్టర్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించేవారు. గాంధీజీ తన నిరశన వ్రతాల్లో పాటించిన నియమాలనే శ్రీరాములు అనుసరించారు.
** ప్రతిరోజూ నాలుగు నిమ్మకాయల రసం, రెండు చెంచాల ఉప్పు, రెండు చిటికెల సోడా టైకార్బొనేట్, రెండు ఔన్సుల తేనె తీసుకునేవారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆయన్ను వైద్య బృందం పరీక్షించి, ఆ వివరాలను నమోదు చేసేది. శ్రీరాములు బరువు మొదటి రోజు – 53.9 కేజీలు, 10వ రోజు – 48.5 కేజీలు, 26వ రోజు – 45.8 కేజీలు, 43వ రోజు – 42.6 కేజీలు, 58వ రోజు – 38.1 కేజీలు.
** 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
డిసెంబర్ 16వ తేదీన రెండెడ్ల బండి మీద కట్టిన రథంపై శ్రీరాములు అంతిమ యాత్ర జరిగింది. కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన.. మాళైలోని ఆర్యవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక పెంకుటిల్లు వరండాలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి తదితరులు శ్రీరాములు గురించి ప్రసంగించారు. మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 19వ తేదీన లోక్సభలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
** పొట్టి శ్రీరాములు కంటే ముందే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండు 1920ల కంటే ముందు నుంచే బలంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికే ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మద్రాసు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆంధ్రా సభ్యులు కొందరు లేవనెత్తారు. పలువురు దీక్షలు కూడా చేశారు.. చేస్తున్నారు. అందులో ప్రధానమైనది స్వామి సీతారామ్గా ప్రచారం పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రిది. ఆంధ్ర జిల్లాల్లో పర్యటించి, తగినంత చైతన్యం వచ్చిందని భావించిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన ఆశ్రమంలో 1951 ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు నిరాహారదీక్ష చేశారు. వినోబా భావే పిలుపుతో దీక్షను విరమించారు. తర్వాత 1952 మే 25వ తేదీ నుంచి మూడు వారాలపాటు మరోమారు దీక్ష చేసి, మరలా విరమించారు. ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు.