దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ipl-2020 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ ముగియనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం దాదాపు 59 రోజుల క్రితం మొదలుపెట్టిన పోరులో చివరికి రెండు జట్లు టైటిల్కు ఒక అడుగు దూరంలో నిలిచాయి. రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్…. మరోవైపు అతి క్లిష్ట పరిస్థితులను దాటుకుని ఫైనల్ వరకు చేరిన శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ రెండు జట్ల బలాబలాలను చూస్తే…
ముంబై ఇండియన్స్ :
ఈ సీజన్ లో ఎటువంటి తడబాటు లేకుండా ప్రతి ఒక్క ప్లేయర్ నుండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబట్టిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. రోజుకొక మ్యాచ్ విన్నర్ జట్టు లో నుండి బయటకు వస్తాడు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, డెత్ బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ కు తిరుగులేదు. ఫీలింగ్ అత్యుత్తమ ప్రామాణికాలతో ఉంటుంది. అయితే వీరికి ఉన్న ఏకైక లోటు క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం. రాహుల్ చహర్ ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ బాధ్యత మొత్తం పేస్ విభాగం పైనే ఉంది. పైగా ఈ సీజన్లో ఇరవై ఏడు వికెట్లతో తన బుమ్రా సత్తా చాటాడు. బౌల్ట్ కొత్త బంతితో తనేంటో నిరూపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, పోలార్డ్ మెరుపులు మామూలుగా లేవు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ నిలకడకు తోడు ఓపెనర్లు రోహిత్, డి కాక్ కూడా రెచ్చిపోతే ముంబై 5వ టైటిల్ ను సాధించడం నల్లేరుపై నడకే..!
ఢిల్లీ క్యాపిటల్స్ :
ఢిల్లీ జట్టు టోర్నీ ఆరంభంలో చాలా భీకరంగా కనిపించింది. ఎక్కువగా యువకులు ఉన్న ఈ టీమ్ లో లో చివరి భాగం వచ్చేసరికి నిలకడలేమి బయటపడింది. మ్యాచ్ ను అర్థం చేసుకొని ఆడే సీనియర్లు తప్పించి యువకుల తొందర పాటుకు గురి అవుతున్నారు. అయితే వీరికి టాలెంట్ కు మాత్రం ఏమి కొదవలేదు. రహానే, ధావన్ టీం లోకి రావడం శుభపరిణామం. వీరిద్దరూ ఇన్నింగ్స్ను ఎంతో పరిణతితో నడిపిస్తున్నారు. పంత్, హెట్మేయర్ బిగ్ స్టేజీ పై మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ అయ్యర్ దగ్గర నుండి ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. పేస్ దళాన్ని సౌత్ ఆఫ్రికా కు చెందిన రబాడ, నోకియా నడిపిస్తున్నారు. అలాగే ఎలాంటి బ్యాట్స్మెన్ ను అయినా అశ్విన్, అక్షర్ పటేల్ నిలువరించగలరు. ఇక ఈరోజు ముంబై బ్యాటింగ్ బలాన్ని బట్టి మరొక ఎక్స్ట్రా తో పేసర్ తో దిల్లీ బరిలోకి దిగవచ్చు. ఇక మార్కస్ స్టాయినిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన ఢిల్లీకి అదనపు బలం అని చెప్పాలి. తమ శక్తికి తగ్గట్టు ఆడితే ముంబై ను ఓడించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
ఇక ఈ సీజన్లో ముంబై తన మూడు మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మట్టికరిపించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ను తేలిగ్గా తీసుకోవడానికి అసలు ఆస్కారం లేదు. ధావన్ ఫామ్ లో ఉన్నాడు… పంత్ మెరిస్తే అంతే సంగతులు. అతనికి హెట్మేయర్ తోడై… స్టాయినిస్ నిలకడగా ఆడితే ఎంతటి భారీ స్కోరునైనా సాధించగలరు, ఛేధించగలరు. ఇక ఢిల్లీ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై తాము ఎప్పుడూ చేసే పని తప్పులు లేకుండా చేస్తే సరిపోతుంది. ఇక ఈ రోజు ఫైనల్ మాత్రం రసవత్తరం అనడంలో ఎలాంటి సందేహం లేదు.