IPL 2021 : ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ గత 24 గంటల్లో కేసుల సంఖ్య లక్ష దాటింది. మొదటి సారి సంభవించిన వైరస్ వ్యాప్తి కంటే కూడా ఇది ఎన్నో రెట్లు అధికంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. అయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన సమావేశం కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఏప్రిల్ 9వ తారీఖున ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. ముంబై లోని పదిమంది గ్రౌండ్ స్టాఫ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ వాయిదా వేయాలని డిమాండ్స్ ఎక్కువ అయ్యాయి. అయితే టోర్నీ ప్రారంభం కాబోయే ఒకరోజు ముందే మోడీ మీటింగ్ ఉండడంతో దీనికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రస్తుతం లాక్ డౌన్ విధించే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. అయితే కోవిడ్ దృష్ట్యా ఎటువంటి సంచలన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇక బిసిసిఐ ఆ నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే మరొక దారి లేకుండా ఐపీఎల్ నిలిపివేయాల్సి పరిస్థితి వస్తుంది.
అదే కనుక జరిగితే బిసిసిఐ కు కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ కి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తారా లేదా అన్నది మరొక అంశం. ఏదైనప్పటికీ ఐపీఎల్ వాయిదా పడే అవకాశాలు తక్కువే అయినప్పటికీ ఈ కరోనా వ్యాప్తిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. కాబట్టి క్రికెట్ అభిమానులు అంతా ప్రధాని తీసుకోబోయే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.