యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్ కోసం జట్లన్నీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. ఫ్రాంచైజీలన్నీ తమ ప్లేయర్లతో టచ్లోకి వచ్చాయి. ఈ క్రమంలో ఐపీఎల్ యాజమాన్యం మరికొద్ది రోజుల్లో ఫ్రాంచైజీలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని కూడా అందజేయనుంది. అందులో జట్ల సభ్యులు, ఇతర సిబ్బంది టోర్నీ సందర్భంగా ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు.. అనే వివరాలు ఉంటాయి. అయితే దుబాయ్లో సుమారుగా 60 రోజుల పాటు ఉండాల్సి వస్తున్నందున అక్కడ హోటల్స్ కన్నా రిసార్టులు అయితేనే మేలని ఐపీఎల్ జట్లు భావిస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో హోటళ్లలో ఉంటే వాటిలో ఉండే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ డక్ట్ల ద్వారా కరోనా సులభంగా వ్యాప్తి చెందుతుందని.. అందుకని రిసార్ట్లు అయితే మేలని ఐపీఎల్ జట్లు భావిస్తున్నాయి. అందులో భాగంగానే సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటికే దుబాయ్లో పలు రిసార్ట్లను బుక్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇక ముంబై ఇండియన్స్ టీం అయితే ఏకంగా ఓ హోటల్ మొత్తాన్ని బుక్ చేయనుందని తెలిసింది.
కాగా బీసీసీఐ ఇదే విషయమై ఇటీవల ఫ్రాంచైజీలకు సూచనలు చేసినట్లు తెలిసింది. హోటల్లో ఏదైనా ఒక ఫ్లోర్ లేదా.. కొన్ని అంతస్థులను ప్లేయర్లు, సిబ్బంది కోసం బుక్ చేయాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ను కేటాయించాలని సూచించిందని తెలిసింది. కానీ ఐపీఎల్ జట్లు మాత్రం దుబాయ్లో రిసార్టులను బుక్ చేసుకునేందుకే ప్రాధాన్యతను ఇస్తున్నాయట. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. రిసార్టులు అయితే ఏసీ అవసరం అంతగా ఉండదని, అలాగే ఒక్కో వ్యక్తికి ఒక్కో రూమ్ ఇచ్చినా.. కరోనా సోకితే ఇతరులకు వ్యాపించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఐపీఎల్ జట్లు భావిస్తున్నాయి. అందుకనే ఫ్రాంచైజీలు రిసార్టులకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ టోర్నమెంట్ యూఏఈలో మొత్తం 3 చోట్ల జరుగుతుంది. దుబాయ్, అబుధాబి, షార్జాల్లో టోర్నీని నిర్వహిస్తారు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అబుధాబి స్టేడియం సమీపంలోనే ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.