ప్రపంచ క్రికెట్ లోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్…. మనం ముద్దుగా పిలుచుకునే ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆఖరిలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా విముఖత చూపించడం ప్రారంభించింది.
దీనితో ఐపీఎల్ నిర్వహించేందుకు బిసిసిఐకి లైన్ క్లియర్ అయినట్లు అయింది. రెండు రోజుల క్రితమే బీసీసీఐ సెప్టెంబరు అఖరి నుండి నవంబర్ మొదటి వారం వరకు ఐపీఎల్ యూఏఈ లో నిర్వహించేందుకు సన్నాహాలు మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడంతో… ఈ రోజున ఐసిసి సమావేశం ఏర్పాటు చేయనుంది.
కరోనా కారణంగా ఐపీఎల్ కు అనేక మంది విదేశీ ఆటగాళ్లు వస్తారు కాబట్టి సరైన ప్రోటోకాల్స్ తో యూఏఈలో నిర్వహించేందుకు బిసిసిఐ యాజమాన్య కసరత్తులు చేస్తోంది. బహుశా స్టేడియంలో అభిమానులు ఉండకపోవచ్చు మరియు ఆటగాళ్లకు అసలు బయట ప్రపంచంతో లీగ్ జరిగినన్ని రోజులు కాంటాక్ట్ ఉండదు.
ఇకపోతే పొట్టి ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వవలసి ఉండగా దీని కారణంగా తమ దేశంలో ఎక్కడ కరుణ విస్తృతస్థాయిలో వ్యాప్తి చెందుతుందో అని వారు దీనికి సముఖంగాలేకపోవడం బిసిసిఐకి కలిసి వచ్చింది. దీనితో ఆ సమయంలో ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారు కాబట్టి సరైన పర్యవేక్షణ మరియు నిబంధనలతో మళ్లీ ఐపీఎల్ మొదలుపెట్టవచ్చు అని ఆశిస్తున్నాను. ఇప్పటికే ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతూ ఉండడం వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం.