బ్యూరోక్రసి అధికారులు ఎందుకో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వ ఒత్తిల్లో.., సొంత అజెండాలో కానీ విమర్శలు, ఆరోపణలతో తరచూ ఎవరో ఒకరు బలైపోతున్నారు. ఆ ఐఏఎస్ , ఐపీఎస్ స్థాయిలో వారికి మానసికంగా ఇది కుంగదీసే విషయమే. తాజాగా ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ పై బదిలీ వేటు పడింది. ఆయన వ్యవహారం వారం రోజుల నుండి అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి పోస్టు ఇవ్వకుండా, పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలంటూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిన్న రాత్రి ఆదేశాలిచ్చారు. దీని వెనుక అనేక కరణాలు కనిపిస్తున్నాయి.
ప్రతాప్ ఆర్టీసీ ఎండీ గా పనిచేశారు. ఆ సమయంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. దీంతో పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి తాను చేస్తున్న సేవలు అంటూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ప్రభుత్వ/ జగన్ భజన కూడా చేసారు. కానీ ఎందుకో ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. ఆయనను గత వారమే ఆర్టీసీ నుండి ఏపీఎస్పీ కి బదిలీ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి…”తాను బాగా పని చేసినా ఆర్టీసీ నుండి ఎందుకు బదిలీ చేశారో అర్ధం కావడం లేదని.., వైఎస్ ఉన్న సమయంలో అధికారుల బదిలీలపై విచారణ జరిగేదని, ఇప్పుడు ఇలా ఉంది అంటూ” ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిలో ఉద్దేశాలను పసిగట్టిన ప్రభుత్వం ఈసారి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపింది. ఏపీఎస్పీ నుండి కూడా వెంటనే రిలీవ్ అవ్వాలని, సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలంటూ రాత్రికి రాత్రి ఆదేశాలు వచ్చేసాయి. దీంతో ఆయన మళ్ళీ కంగుతిన్నారు.