AP Politics: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం చాలా మంది సచివులు సంతోషంగా కనిపిస్తున్నారు.విషయం ఏమిటని ఆరా తీస్తే వారికి ముఖ్యమంత్రి జగన్ ఒక వరమిచ్చారట.ఇంతకుముందు తాను చెప్పినట్లు రెండున్నర సంవత్సరాలకు కాకుండా మూడేళ్ల తర్వాత తన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన క్యాబినెట్ మీటింగ్ లోనే చెప్పేసినట్లు కొందరు మంత్రుల ఆంతరంగికులు లీకులిస్తున్నారు.
2019 లో జగన్ తన తొలి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు ఈ క్యాబినెట్ రెండున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత వీరిలో తొంభై శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించడం తెలిసిందే.పనితీరు ప్రాతిపదికన, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని రెండున్నరేళ్ల తర్వాత జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని పరిశీలకులు భావించారు.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబర్ లోపే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరగాల్సివుంది.దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కసరత్తు కూడా చేస్తున్నారని పలువురు మంత్రులు అవుట్ ..ఫలానా వారు ఇన్ అంటూ మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా రావడం కూడా మొదలైపోయింది.దీంతో ఆశావహులకు ఆరాటం ఎక్కువైంది.మంత్రులుగా ఉన్నవారికి టెన్షన్ పట్టుకుంది.
AP Politics: మరి జగన్ ఎంతైనా వెరైటీ కదా?
ఈలోపు ముఖ్యమంత్రి జగన్ ఏం ఆలోచించుకున్నారో ఏమో తాజా క్యాబినెట్ సమావేశంలో ప్రస్తుత మంత్రులు మూడేళ్ల వరకు కొనసాగుతారని హామీ ఇచ్చారట.దీనికి కరోనాని కారణంగా చూపారట.కరోనా వల్ల దాదాపు పది నెలల పాటు మంత్రులెవరూ విధులు నిర్వర్తించే లేని పరిస్థితి ఏర్పడినందున దాన్ని పరిగణనలోకి తీసుకొని తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణను మూడేళ్ల తర్వాత చేస్తానని, ఈలోపు ఎవరికి వారు బాగా పని చేయాలని మంత్రులకు సీఎం స్పష్టం చేశారట.అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటున్నారు.అత్యంత బలమైన ,శక్తి సామర్థ్యాలున్న మంత్రులతో 2024 ఎన్నికలకు వెళ్లాలన్న తలంపుతోనే జగన్ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణను వాయిదా వేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.పైగా ప్రస్తుతమున్న మంత్రులు మూడేళ్లపాటు కొనసాగినందువల్ల,ఒకవేళ వారిని తప్పించినా పెద్దగా రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదురుకాబోవని,అసమ్మతి బెడద లాంటిది తలెత్తబోదని జగన్ అంచనా అని చెబుతున్నారు.అయితే మన సీఎం జగన్ వెరైటీ కాబట్టి ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేరని రాజకీయ పరిశీలకులు ముక్తాయింపు ఇస్తున్నారు.