అచ్చెన్నస్టేట్ మెంటే కీలకం.. అవే కంటిన్యూ..అరెస్ట్ తప్పదా..!
కాంట్రాక్టర్లతో పితాని కుమారుడి లావాదేవీలు..!
ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కాం లో టీడీపీ హాయంలో పని చేసిన మరో మాజీ మంత్రికి ఉచ్చు బిగుసుకుంటోంది. అచ్చెన్నాయుడు తరువాత కార్మిక మంత్రిగా పని చేసిన పితాని పాత్ర పైన ఏసీబీ ఆరా తీస్తోంది.
పితాని మంత్రిగా వ్యవహరించిన సమయంలోనూ అచ్చెన్నాయుడు హాయంలో జరిగిన అక్రమాలు..అవకతవకలు కొనసాగించినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే పితాని కుమారుడు..వ్యక్తిగత కార్యదర్శులను ఏసీబీ నిందితులుగా పేర్కొంది. అందులో బాగంగా పితాని వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన మురళీ మోహన్ ను అరెస్ట్ చేసి విచారించింది. పితాని కుమారుడు కోసం ఏసీబీ గాలింపు చర్యలు మొదలు పెట్టింది. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి పితాని ప్రమేయం పైనా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పక్క సమాచారం..ఆధారాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. దీంతో..మరి పితానిని సైతం అరెస్ట్ చేస్తారా అనే చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.
పితాని పాత్రపైన అచ్చెన్న స్టేట్ మెంట్ కీలకంగా…
కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. పరోక్షంగా పితాని సమయంలోనూ అక్రమాలు జరిగాయనే ఆయన స్టేట్ మెంట్ ఇప్పుడు పితాని మెడకు చుట్టుకుంటోంది.
కాంట్రాక్టర్లతో పితాని కుమారుడి లావాదేవీలు ..
పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన పితాని వ్యక్తిగత కార్యదర్శి మురళీ మోహన్ నుండి కీలక సమాచారం సేకరించినట్లుగా విశ్వసనీయ సమాచారం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని, బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. పితాని కుమారుడి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. పితాని కుమారుడు ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయటంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్లలో గాలింపు ముమ్మరం చేశాయి. రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈఎస్ఐ స్కాంలో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.