మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ, ఇంద్ర, సైరా సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ వంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది మెగాస్టార్ కూతురు సుస్మిత. ఇలా కాస్ట్యూమ్ డిజైనర్గా మెగా డాటర్ ఇంత కాలం తెర వెనక ఉండి ఒక్కసారిగా నిర్మాతగా మారిపోయింది. అది కూడా తండ్రి ప్రోత్సాహంతో. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సుస్మిత నిర్మాతగా మారబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. ఈ విషయం స్వయంగా మెగాస్టార్ వెల్లడించడంతో అందరూ సినిమా నిర్మించబోతుందన్న చర్చలు జరిగాయి. అయితే తొలి ప్రయత్నంగా ఒక వెబ్ సిరీస్ తో నిర్మాణం రంగం లో అడుగు పెట్టింది.
సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వెబ్ సిరీస్ ని మొదలు పెట్టారు. సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘జీ 5’ ఓటీటీలో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కానుండటం విశేషం. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. క్రిమినల్స్, పోలీసులకు మధ్య జరిగిన నిజ ఘటనలకు సంబంధించిన కథనాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించడం ఇప్పుడు అందరిలోను ఆసక్తిని పెంచుతోంది. ఈ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆనంద్ రంగా గతంలో సిద్దార్థ్ శాలిని జంటగా ”ఓయ్” అనే సినిమా రూపొందించగా ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు నుంచి సినిమా రాలేదు. మళ్ళీ ఈ వెబ్ సిరీస్ తోనే ఆనంద్ రంగా ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఇక హైదరాబాద్ లోని కాచిగూడ ప్రాంతంలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో చిరుని చిన్న పాత్రలో కనిపించమని కూతురు పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి కూడా తను తీయబోయో ఈ వెబ్ సిరీస్ లో నేను నటిస్తానా లేదా అన్నది తెలీదంటూ హింట్ ఇచ్చారు. మరి నిజంగా మెగాస్టార్ కనిపిస్తారా లేదా అన్నది త్వరలో తెలియనుంది.