ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూత పడి దాదాపు 5 నెలలు కావస్తుంది. ఇంకా ఎన్ని నెలలు ఇలాంటి పరిస్థితి ఉంటుందో మేధావులే చెప్పలేని పరిస్థితి. అదీకాక థియోటర్స్ తెరిచినా ప్రేక్షకులు థియోటర్స్ కి వచ్చి సినిమా చూస్తారా..అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా మంచి ఆఫర్ వస్తే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ విషయంలో ముందు ధైర్యంగా అడుగు వేసింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అని చెప్పాలి.
తన భార్య నటించిన పోన్మగల్ వందాల్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకి ఓటీటీలో నే రిలీజ్ చేసి తన పథం నెగ్గించుకున్నాడు. ఆ తర్వాత కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ లో స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరికి మంచిదని భావిస్తూ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తన నటించిన తాజా చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. సూర్య కి తమిళం తో పాటు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన తమిళంలో నటించిన సినిమాలన్ని తెలుగులోను రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సినిమాని “ఆకాశం నీ హద్దురా” అన్న టైటిల్ తో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఈ డీల్ ఓకే అయితే సూర్య సినిమా ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేస్తారని తాజా సమాచారం.