భారతదేశంలో కరోనాపై విజయం సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ పేరు తెచ్చుకుంది.ఆ రాష్ట్రంలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల అనతికాలంలోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా చెప్పుకున్నారు.కేరళను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అప్పట్లో మీడియా కీర్తించింది.అయితే తాజాగా కేరళలో కరోనా మరణాల గుట్టు రట్టయింది.సగానికి సగం కరోనా మరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టినట్లు వెల్లడైంది.డాక్టర్ అరుణ్ మాధవన్ నాయకత్వంలో ఒక వలంటీర్ల బృందం కరోనా కేరళలో ప్రవేశించినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో సంభవించిన మరణాల వివరాలను సేకరించారు.ఈ బృందం ఏడు స్థానిక వార్తాపత్రికల జిల్లా ఎడిషన్లను, ఐదు న్యూస్ ఛానెళ్లనూ క్రమం తప్పకుండా రోజూ చూస్తూ… వాటిల్లో వచ్చిన ప్రతీ మరణ వార్తనూ, సంస్మరణ దినాల వివరాలను నమోదు చేశారు.
గురువారం నాటికి కేరళలో 3,356 కోవిడ్-19 మరణాలు సంభవించినట్లుగా ఈ వలంటీర్ల బృందం వేసిన లెక్కల్లో తేలింది.అయితే, అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్-19 మరణాల సంఖ్య 1,969 మాత్రమే.ఇదే విషయాన్ని వెల్లడిస్తూ “అనేక కోవిడ్-19 మరణాలను లెక్కించడం లేదు. ప్రభుత్వం చాలా కోవిడ్-19 మరణాలను ఇతర అనారోగ్య కారణాల వల్ల సంభవించిన మరణాలుగా లెక్కించింది” అని డా. మాధవన్ తెలిపారు. చనిపోయేముందు కోవిడ్-19 నెగటివ్ వచ్చినవారిని, కేరళకు చెందనివారిని లెక్కించలేదు.ఇది అండర్ రిపోర్టింగ్ అంటే వాస్తవాన్ని తక్కువ చేసి చూపించడం కిందకు వస్తుందని ఆయన చెప్పారు.తన తన క్లినిక్ లోనే తాను ముగ్గురికి కరోనా చికిత్స చేస్తుండగా వారు మరణించారని ఆ వివరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు.
“కేరళలో కోవిడ్ 19 మరణాలను ఉద్దేశపూర్వకంగానే, ఒక పద్ధతి ప్రకారం తక్కువగా లెక్కిస్తున్నారని” అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్కు చెందిన ఓమన్ సీ కురియన్ అభిప్రాయపడ్డారు.కాగా కేరళ ప్రభుత్వం కోవిడ్ మరణాలను 30% తక్కువగా లెక్కించిందని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి కూడా చెప్పారు. మొత్తం మరణాలన్నీ లెక్క వేసుకున్నా కూడా కేరళలో కరోనా వ్యాప్తి ని తమ ప్రభుత్వం సమర్థంగా నిరోధించిందని ఆయన కవర్ చేసుకున్నారు ఏదేమైనప్పటికీ డేటా విషయంలో పారదర్శకత పాటిస్తూ, అధికారికంగా సమగ్రమైన కోవిడ్ 19 గణాంకాల పట్టికను రూపొందిస్తూ వస్తున్న కేరళలో మరణాల సంఖ్యను తక్కువ లెక్కించడం ఆశ్చర్యకరమైన విషయం.