టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నప్పటికి పరిస్థితులు సహకరించక ఇంకా కొంత టాకీ పార్ట్ కంప్లీట్ కాకుండానే సినిమా లాక్ డౌన్ తో నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో నితిన్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళి సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.
ఈ సినిమా తర్వాత నితిన్ నుంచి మరో రెండు సినిమాలు రానున్నాయన్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ తెలుగు రీమేక్ లోను నితిన్ నటించనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా హీరో ఆయుష్మాన్ ఖురానా కి జాతీయ ఉత్తమనటుడు అవార్డు ను తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తెలుగు రీమేక్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందనుంది. అయితే ఈ సినిమాలో ఉన్న రెండు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ లో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ క్యారెక్టర్స్ కాస్త బోల్డ్ గా ఉండటంతో తెలుగులో ఈ క్యారెక్టర్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం హిందీలో టబు పోషించిన పాత్రలో నయనతార ని చిత్ర బృందం అనుకుంటున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో నయనతార కి దర్శకుడు కథ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ పాత్ర కి నయనతార ఒకే చెబుతుందా లేదా చూడాలి. బోల్డ్ క్యారెక్టర్ కాబట్టి నయనతార ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకి బాగా హైప్ రావడం ఖాయం. ఇక రాధిక ఆప్టే పోషించిన హీరోయిన్ క్యారెక్టర్ కి తెలుగులో హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సి ఉంది.