డైరెక్టర్ తేజ కి ఇండస్ట్రీలో ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. చిత్రం సినిమా నుంచి ఎంతో మంది టాలెంటెడ్ హీరో, హీరోయిన్స్ ని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళలో కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ తో పాటు నితిన్ లాంటి యంగ్ హీరోలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. ఇక ఆ మధ్య రానా దగ్గుబాటి – కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తేజ నేనే రాజు నేనే మంత్రి అన్న సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు తేజ సక్సస్ లు లేక ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేలకి రానా, కాజల్ లతో హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాడు.
అయితే ఆ తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో సీత అన్న సినిమా తీశాడు. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సస్ ని సాధించలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న తేజ ఒకేసారి రెండు సినిమాలని ప్రకటించాడు. ఆ సినిమాలలో ఒకటి రానా దగ్గుబాటి తో చేయాలని అనుకున్న సినిమా కాగా మరో సినిమా గోపీచంద్ తో చేయాలనుకున్న అలిమేలుమంగ వెంకట రమణ.
ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అన్న సినిమా చేస్తున్నాడు. తమన్న భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని దర్శకుడు వెల్లడించాడు. కాగా ఈ సినిమా మీద గోపీచంద్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మొదలవ్వాల్సిన తేజ – గోపీచంద్ ల అలిమేలుమంగ వెంకటరమణ కి హీరోయిన్ సెట్ అవక పెండింగ్ లో పడింది. ఇప్పటికే కాజల్, కీర్తి సురేష్, అనుష్క పేర్లు ప్రచారంలో వచ్చాయి. కాని ఎవరూ ఫైనల్ కాలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఉప్పెన ఫేం కృతి శెట్టి తేజ అనుకున్న అలిమేలుమంగ గా నటించబోతుందని తెలుస్తోంది. మరి ఎంతవరకు నిజమో చూడాలి.