మిల్కీ బ్యూటీ మొత్తం సినిమా కెరీర్ 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. సూపర్ స్టార్స్ తో నటించింది. యంగ్ హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు దాదాపు అందరితోను నటించి సక్సస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక బాహుబలి, సైరా వంటి పాన్ ఇండియా సినిమాలలోను నటించిన తమన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇప్పటికీ వెలుగుతోంది.
అయితే తను ఈ స్థాయికి రావడానికి మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదని వెల్లడించింది. 15 ఏళ్ల వయసులోనే నటిగా సినీరంగ ప్రవేశం చేసిన తమన్నా ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలీవుడ్ లో తమన్నాని పట్టించుకున్న మేకర్స్ గాని, హీరోలు గాని లేకపోవడం ఆశ్చర్యకరం. దీంతో టాలీవుడ్ లో అదృష్ఠాన్ని పరీక్షించుకుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ లా కాకుండా టాలీవుడ్ లో తన సత్తా ఏంటో చూపించింది. వరసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది.
మంచు మనోజ్ హీరోగా శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలినప్పటికి తమన్నాకి మంచి పేరు వచ్చింది. దాంతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అంతే మళ్ళీ ఇప్పటి వరకు కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అయితే ముంబై నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ సాయం చేయలేదని.. తన సొంత ప్రయత్నంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకున్నాని తెలిపింది. ఇక తనకి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలన్న కల మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సీటిమార్ సినిమాలో నటిస్తున్న తమన్నా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం ఒక సెలబ్రిటీ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతుంది.