Shiv Sena: మళ్లీ బీజేపీ శివసేనలు దగ్గర అవుతున్నాయా అన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి.మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నేరుగా ప్రధాని నరేంద్రమోడీ తో భేటీ అవడం,వారిద్దరి మధ్య సాదరపూర్వకమైన చర్చలు జరగడం తెలిసిందే.ఇక గురువారం నాడు శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు.
టాప్ మోస్ట్ లీడర్ నరేంద్రమోడీ!
ప్రధాని మోదీ ఈ దేశానికి,, బీజేపీకి టాప్ లీడర్ అని ఆ ఎంపీ పేర్కొన్నారు.నిజానికి బీజేపీకి ఇంత వైభవం తెచ్చిన నరేంద్రమోడీకి ఆ పార్టీ నాయకత్వం రుణపడి ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.బిజెపిని కంట్రోల్ చేసే ఆరెస్సెస్ రాష్ర్టాల ఎన్నికల్లో కేవలం స్థానిక నాయకులే ప్రచారం చెయ్యాలని ఒక ప్రతిపాదన చేయడం నరేంద్ర మోడీ పాపులారిటీ తగ్గిందనడానికి నిదర్శనమా అని మీడియా ప్రశ్నించగా ఆ ఎంపీ ఇలాంటి ఊహాజనిత ప్రచారం పై తాను స్పందించనన్నారు.ఆరెస్సెస్ అలా ప్రతిపాదన చేసినట్లు ఎక్కడా అధికారికంగా ఇంకా మీడియాలో రాలేదన్నారు. అయితే ఈ దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ రాష్ర్టాల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనకపోవటమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.మోడీ దేశం మొత్తానికి నాయకుడని,ఏ ఒక్క పార్టీకో నేతగా తాము భావించడం లేదని సంజయ్ రౌత్ వివరించారు.ప్రధాని నరేంద్రమోడీ కోరితే తాము టైగర్(శివసేన చిహ్నం) తో కలిసి పనిచేయడానికి సిద్ధమని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ప్రకటన గురించి ప్రస్తావించగా టైగర్ తో ఎవరు మైత్రి చేయలేరని, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నది టైగరే నిర్ణయించుకుంటుందని ఎంపీ సంజయ్ రౌత్ బదులిచ్చారు.
Shiv Sena: శివసేన మూడ్ మారుతోందా?
ఇదే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సమావేశమయ్యాక “మూడ్ మారుతోంది”అని చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.మొన్నటి ఎన్నికల ముందు వరకు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ శివసేనలు ముఖ్యమంత్రి పీఠం వద్ద విభేదాలొచ్చి విడిపోయాయి.కాంగ్రెస్ ,ఎన్సీపీల మద్దతు తీసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రయ్యారు.ఇప్పటికైతే మహారాష్ట్ర అధికార కూటమిలో ఎటువంటి కుదుపులు కన్పించనప్పటికీ ఎన్సీపీ అధినేత పవార్ ఈ మధ్య బీజేపీ మాజీ ముఖ్యమంత్రి పడ్నవీస్ ను కలుసుకున్నారన్న సమాచారం శివసేనకు ఆగ్రహం కలిగించినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా శివసేన కూడా బీజేపీకి మళ్లీ దగ్గరవుతున్నట్లే కన్పిస్తోంది.శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.