Shabnam Case : ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను హతమార్చిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్ ఉరికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు తన తల్లి నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే గవర్నర్ ఆనందీబెన్ క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే మరోసారి గవర్నర్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. మళ్లీ తిరస్కరణకు గురైతే ఆమెను ఉరితీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్నూ ఉరి తీసే అవకాశం ఉంది. కాగా 2008లో తన ప్రియుడితో కలిసి చిన్న పిల్లలనే కనికరం లేకుండా షబ్నమ్.. ఆమె కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపేసింది.
Shabnam Case : ఇంతకీ షబ్నమ్ అలీ ఎవరు
రెండు పీజీలు చేసిన ఈ చదువుల తల్లి.. ఎందుకు ఈ హత్యలు చేయాల్సి వచ్చింది.. స్టోరీలోకి వెళితే.. సీన్ సీన్ కి మలుపులు కనిపిస్తాయి. షబ్నమ్ అలీ.. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావాంఖేరి గ్రామం ఆమెది. సైఫీ ముస్లిం వర్గానికి చెందిన ఆమె తండ్రి టీచరుగా పనిచేశారు. షబ్నమ్.. ఇంగ్లీష్, భౌగోళిక శాస్త్రంలో ఎంఏ చేసింది. అంటే రెండు సబ్జెక్టుల్లో పీజీలు చేసింది. సో.. ఉన్నత విద్యావంతురాలే. అంత చదువుకున్న ఆమెకు చాలా తెలివితేటలు ఉండి ఉంటాయని, ఏ పని చేసినా ఆలోచించి చేస్తుందని అనుకుంటే పొరపాటే.. క్షణికావేశంలో ఎవరూ క్షమించని నేరం చేసింది.షబ్నమ్ కొద్ది రోజులు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. పాఠశాలలో ఆమె అంటే గౌరవం.. విద్యార్థులకు షబ్నమ్ ఎంతో ఇష్టమైన టీచర్ కూడా.
సిక్స్ డ్రాపౌట్ సలీమ్ తో ప్రేమ!
మంచి లక్షణాలున్న అమ్మాయిగా పేరున్న షబ్నమ్.. ఆరో తరగతి మధ్యలోనే ఆపేసిన సలీంని ప్రేమించింది. సలీం చదువుకోకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ రంపపు కోత మిషన్ లో దినసరి కూలీగా పనిచేసేవాడు.సలీంతో ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. షబ్నమ్ కుటుంబంలో చదువుకున్న వ్యక్తులు అధికం. దానికి తోడు సలీం కంటే సంపన్నులు. అన్ని విధాలుగా అతడి కంటే ఎన్నో రెట్లు పై మెట్టు మీద ఉంది షబ్నమ్ కుటుంబం. సలీమ్ కుటుంబం ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం. దీనికితోడు అతడి సామాజిక నేపథ్యం షబ్నం తల్లిదండ్రులకు రుచించలేదు. దాంతో ఆమె ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. షబ్నమ్ తాత అయితే మనవరాలు చేసిన పనికి తలెత్తుకోలేక, బయటకు వెళ్లలేక పోయేవాడు. సరిగా ఆహారం కూడా తీసుకునేవాడు కాదని గ్రామస్తులు చెప్పారు. దానికి కారణం వారికి షబ్నం అంటే చెప్పలేనంత ఇష్టం. బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేసి కుటుంబం పేరు నిలబెడుతుందని ఆశించేవారు.సలీంతో షబ్నమ్ సంబంధం గురించి ఆమె తమ్ముడు రషీద్కు కూడా తెలుసు. ఈ విషయంలో రషీద్.. షబ్నమ్ను ఒకసారి చెంపదెబ్బ కొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రేమను కాదన్నారని పగ పెంచుకుంది!
ఇంట్లో తన ప్రేమను వ్యతిరేకించిన ఏడుగురినీ అసహ్యించుకున్నారు షబ్నమ్. వారే అడ్డు లేకపోతే సలీమ్ తో తన జీవితం సంతోషంగా ఉంటుందని భావించింది. ఆ ఆలోచనే ఆమెతో హత్యలు చేయించ డానికి వెనుకాడనివ్వలేదు. కుటుంబాన్ని అంతమొందించాలని అనుకుంది. అందులో భాగంగానే ఎప్పుడు ఇంట్లోకి లీటర్ పాలు తీసుకొచ్చే షబ్నం.. ఏప్రిల్ 15, 2008 న రెండు లీటర్ల పాలు కొనుక్కొ చ్చింది. పాలలో మత్తు మందు కలిపి కుటుంబంలోని ఏడుగురికీ ఇచ్చింది. వారు మత్తులోకి జారుకున్నాక ఆ ఏడుగురినీ షబ్నమ్ గొడ్డలితో నరికి చంపేసింది. అయితే హత్యలు జరుగుతున్నప్పుడు సలీం అక్కడే ఉండడంతో.. కుట్రలో పాలు పంచుకున్నందుకు గాను కోర్టు సలీంకు కూడా మరణశిక్ష విధించింది.