ఆమె సెకండ్ టైమ్ ఎమ్మెల్యే !అంతేగాక క్యాబినెట్ హోదా కలిగిన ఎపిఐఐసి కార్పొరేషన్ చైర్మన్ .అన్నింటికి మించి వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముద్దుల సోదరి.పార్టీలో కూడా ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది.
ప్రతిపక్షాలు సైతం ఆమెతో పెట్టుకోడానికి సాహసించవు.కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆమె పరిస్థితి తయారైంది .స్వంత నియోజకవర్గం లోనే ఆమెకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళా ఎమ్మెల్యే ఏకంగా కన్నీరే పెట్టుకోవటం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది.మీరు ఊహించిందే కరెక్ట్! అవును … ఇదంతా చిత్తూరు జిల్లా నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా గురించే!
అసలేం జరిగిందంటే!
వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనీ..పార్టీ కార్యక్రమాలకు తనను ఎవ్వరూ పిలవట్లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం సోమవారం తిరుపతిలో జరగ్గా అందులో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు.తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని.. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని..ఓ ఎమ్మెల్యేగా ఇది నాకు అవమానమని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోజా ఫిర్యాదుపై కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
కమిటీ చైర్మన్ కాకాని భరోసా!
రోజా ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేశారని..అన్ని విషయాలకు జిల్లా కలెక్టర్కు చెప్పామని.. అవన్నీ సరిచేస్తామని తెలిపారు. ఇక ఇటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారని కాకాణి తెలిపారు.
రోజాను మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ చేశారా!
కాగా చిత్తూరు జిల్లా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే నగరి నియోజకవర్గంలో కూడా ఆమెకు సీన్ లేకుండా అధికారులు చేస్తున్నారని టాక్.ఇటీవల ముఖ్యమంత్రి బిసి కార్పొరేషన్ చైర్మన్లను నియమించిన సందర్భంలో కూడా రోజా బద్ధవిరోధి ఒకరికి పదవి లభించడం వెనుకా పెద్దిరెడ్డి హస్తం ఉందంటారు. మంత్రి ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులు ఆమె స్వంత నియోజకవర్గం నగరిలో ఎమ్మెల్యే రోజా లేకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైసిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.ఇప్పటి వరకు ఈ విషయం గోప్యంగా ఉన్నప్పటికీ ఈరోజు రోజా ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో గుట్టు విప్పేసింది.మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి !