ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానం కలుగుతోంది.మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు లభించాయి.విశాఖపట్నం తరువాత అంతటి గౌరవప్రదమైన ఫలితం టిడిపికి దక్కింది ప్రకాశం జిల్లాలోనే.
తాజా పరిణామాల నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసిపికి జైకొట్టారు.అయినప్పటికీ ఇంకా అక్కడ టూ టైమ్ ఎమ్మెల్యేలు డోలా వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారులు టిడిపిలో ఉన్నారు.అందరూ శక్తిమంతులే..కానీ జగను ప్రభుత్వంపై పోరాటానికి వారు ఎందుకనో సిద్ధంగా లేరు.ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడు కూడా వారు విపక్షంగా వారు స్పందించడం లేదు.ఇరవై ఏడు వేల కరోనా కిట్టు వృథా అయ్యాయని కలెక్టర్ చెప్పినప్పుడు ఆయనపై ఫైర్ అయిన ఏలూరి సాంబశివరావు ఆ తరువాత మౌనం దాల్చారు.ఇక ఒక దళిత యువకుడు చీరాలలో పోలీసు లాఠీలకుబలైపోతే దళిత ఎమ్మెల్యేగా ఉన్న బాల వీరాంజనేయ స్వామి నోరు మెదపలేదు.గొట్టిపాటి రవికుమార్ కేవలం అద్దంకి కే పరిమితమై తన రాజకీయం చేస్తున్నారు తప్ప మిగతా విషయాలు పట్టించుకోవడం లేదు.
అలాగే ఇంచార్జీలుగా ఉన్న పోతుల రామారావు ,కందుల నారాయణరెడ్డి ,అశోక్రెడ్డి ,ఉగ్ర నరసింహారెడ్డి,అజితారావుల ఉనికే కరువైంది.దర్శి ఇంచార్జిగా ఉన్న కదిరి బాబురావు వైసీపీలో చేరిపోయాడు.చీరాల ఇంచార్జిగా ఉన్న యడం బాలాజీ అమెరికాలో వ్యాపారం చేసుకుంటుంటాడు.జిల్లా టిడిపి జట్టు దామచర్ల జనార్దన్ ఉత్సవ విగ్రహంగా మారాడు.బాపట్ల మాజీ ఎంపి మాల్యాద్రి మచ్చుకైనా ఎక్కడా కనిపించడం లేదు.ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సిద్ధారాఘవరావు వైసిపి తీర్థం పుచ్చుకున్నాడు.నేతలకే ఏమి పట్టనప్పుడు కార్యకర్తలు పూర్తి నిరుత్సాహంలో మునిగిపోయి పసుపు జెండాను కింద పడేసిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది.