ప్రకృతికి అన్నీ ఇవ్వడమే కాదు.. సర్వస్వాన్నితీసుకుపోవడం కూడా తెలుసు.. దీనికి ప్రపంచంలో ఏదో ఒక చోట నిత్యం జరుగుతున్న విపత్తులు, వింతలే నిదర్శనం. వీటిని చూసిన ప్రతీసారి సినిమాల్లో, పుస్తకాల్లో రాసిన యుగాతం విషయం గుర్తుకు వస్తునే ఉంటుంది. దీంతో ఏ చిన్న వింతను చూసినా అది యుగాంతానికి చిహ్నం అంటూ నెటిజన్లు సోషల్ మీడియ వేదికగా పోస్ట్ ల వర్షం కురిపిస్తునే వస్తున్నారు. ఇలాంటి విషయమే ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒంటి కన్ను చేప న్యూస్.
“ఈ ఒంటి కన్ను చేపను చూసిన చాలా మంది ప్రళయం రాబోతోంది.. ఇది యుగాంతానికి సూచిక.. ఇదే సాక్ష్యం” అంటూ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో ఆ నోటా ఈ నోటా చేరి ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఈ వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియా సముద్ర జలాల్లో జాలర్లు ఒక షార్క్ చేపను పట్టుకున్నారు. దాన్ని కోస్తే.. దాని కడుపులో ఇంకో బుల్లి షార్క్ ఉంది. అయితే అందులో ఏం విశేషం ఉంది అని తీసిపారేయకండి.. అందులోనే ఒక విశేషం ఉంది. ఈ బుల్లి చేప కార్టూను సినిమాల్లో కనిపించే ఒంటి కన్ను చేపలా ఉంది. ఐదు రూపాయల బిల్ల అంత సైజులో ఉన్న దీని కన్నును చూసిన నెటిజన్లు ఇది యుగాంతానికి సూచిక అంటూ క్షణాల్లోనే దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే అక్టోబరు 10న మాలుకూలో బయట పడిని ఈ చేపను చూసిన పరిశోధకులు..సైక్లోపియా అనే సమస్యతో ఇలా చేపలు పుడతాయని పేర్కొన్నారు. గ్రీకు పురాణాల్లో ఈ సైక్లోప్స్ చేప గురించి ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారీ కన్ను ఉంటుందని, చూడగానే భయం వేసేలా ఉంటుందని తెలిపారు.
ఏది ఏమైనప్పటికీ జనాల్లోని భయానికో లేక మరే విషయానికో కావచ్చు కానీ ఇలాంటి విషయాలు మాత్రం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపి ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. సైంటిస్టులు యుగాంతం, ప్రళయాల గురించి నమ్మొద్దని ఎంత చెప్పినా కానీ ఇలాంటి వింతలు, విశేషాలు జరిగినప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురి వాదన.