Chief Ministers: ఎండాకాలం, వానాకాలం ,శీతా కాలమని ఇలా దేశంలో అనేక సీజన్లు ఉంటాయి.ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రుల మార్పిడి సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ నెలలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది.ఇక మూడు నాలుగు రోజుల్లో కర్నాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా పదవీ గండం ఉంది.పంజాబ్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.
అసలేం జరుగుతోంది?
ఈ దేశంలో బిజెపి ,కాంగ్రెస్ లు రెండే ప్రధాన రాజకీయ పార్టీలు.మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉండగా కొద్ది రాష్ట్రాలు కాంగ్రెసుకు మిగిలాయి.ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా ఆయా పార్టీలు సీఎంలను మార్చుతూ వెళుతున్నాయి.ఒకప్పుడు తరచూ ముఖ్యమంత్రులను మారుస్తుందన్న అపప్రథ కాంగ్రెస్ కి ఉండేది.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్.1978-83 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి,అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లు ముఖ్యమంత్రులు అయ్యారు.1989-94 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకుడు కాబట్టి 2004నుండి 2009 లో మరణించే వరకు వరకు ఆయనే సీఎంగా కొనసాగారు.కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారని టెర్మ్ ఏదైనా ఉంటే అది ఇదే.వైఎస్సార్ మరణానంతరం కొద్దిరోజులు కొణిజేటి రోశయ్య,ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పాలించారు.ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. అది వేరే విషయం.విచిత్రం ఏమిటంటే ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ సంస్కృతిని అవలంబిస్తోంది.
వరుసపెట్టి బిజెపి సీఎంల మార్పులు!
భారతీయ జనతాపార్టీ ఇటీవలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ను తొలగించి పుష్కర్ సింగ్ దామీ కి పట్టంగట్టింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈనెల ఇరవై ఆరో తేదీన తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.వృద్ధాప్యం కారణంగా పార్టీ నియమావళి ప్రకారం తాను ముఖ్యమంత్రిగా తప్పుకుంటున్నానని యడ్యూరప్ప చెప్పినప్పటికీ,బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన కుర్చీ దిగుతున్నారని సమాచారం.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.త్వరలోనే ఆయనకు పదవీచ్యుతి తప్పదంటున్నారు.ఇక కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇవాళ రేపు ఇంటికెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారని టాక్.