Jagan KCR: కరోనా మహమ్మారి రాష్ట్రాల మధ్య దూరాన్ని కూడా పెంచేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆయా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో వస్తోన్న అంబులెన్స్లను పోలీసులు తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.
నిజానికి హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ఉమ్మడి రాజధాని.2024 వరకు ఆంధ్రప్రదేశ్ కి కూడా హైదరాబాదు మీద పూర్తి హక్కు ఉంది.అయినప్పటికీ తెలంగాణ ఏకపక్షంగా చివరకు ఆరోగ్యానికి సంబంధించిన అంబులెన్స్ లను కూడా నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది.సోమవారం ఉదయం వీటికి సంబంధించిన వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
పోలీసుల సలహా ఏమిటంటే!
వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ ప్రైవేటు అంబులెన్సులో వెళ్తోన్న వారికి షరతులతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. దీనికి వీలు కానీ పక్షంలో కరోనా రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. హైదరాబాద్కు చెందిన సదరు ఆసుపత్రి యాజమాన్యం నుంచి ముందుగానే అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. ఇలా ముందస్తు అనుమతులతో వెళ్లిన వారికే తెలంగాణలోకి అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇక సోమవారం ఉదయం నుంచి ఏపీ నుంచి హైదరాబాద్కు కోవిడ్ పేషెంట్స్తో వస్తోన్న అంబులెన్స్లను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టి.. అంబులెన్స్లను వెనక్కి పంపిస్తున్నారు.ఈ విషయం పెద్దదై మరో కొత్త వివాదానికి దారితీసే సూచనలు గోచరిస్తున్నాయి.
బిజెపి విష్ణు గరంగరం !
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డుకోవడంపై ఏపీ బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్ నగరం పదేళ్ల వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం వచ్చే వారిని ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ మెడికల్ హబ్ అని.. చికిత్స కోసం అనేక ప్రాంతాల నుంచి బాధితులు వస్తారని అన్నారు.కరోనా రోగులు, ఇతర బాధితులు అత్యవసర సేవల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక కరోనా సంక్షోభం సమయంలో వైద్యానికి సంబంధించి అయితే ఎల్లలు కూడా అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని, మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అనే విషయాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించాలని విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.