శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. పీ ఎస్ ఎల్ వి రాకెట్ల ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో… అదే స్ఫూర్తితో ఇప్పుడు జి ఎస్ ఎల్ వి సిరీస్ పైనా దృష్టి పెట్టింది. అత్యంత బరువైన ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన జి ఎస్ ఎల్ వి అంతరిక్ష వాహక నౌకల రూపకల్పనలో… స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోహాగాల పరంపరను కొనసాగిస్తోంది.
విశ్వవినువీధుల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకోగలిగిన జి ఎస్ ఎల్ వి వాహక నౌక ద్వారా చంద్రయాన్ కు సిద్ధమౌతున్న ఇస్రో, వచ్చే నెల 5 న జీఎస్ఎల్ వి -ఎఫ్ 10 ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు శ్రీహరికోట షార్ రాకెట్ కేంద్రంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
సతీశ్ ధవన్ స్పెస్ సెంటర్
షార్ నుంచి వచ్చేనెల మార్చి 5న జీఎస్ఎల్వీ-ఎఫ్-10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్ ఎల్వీ వాహక నౌక అనుసంధానం ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇక ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. దీని ద్వారా 2,300 కిలోల బరువు గల గీశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
ఇప్పటికే ఇంధనం నింపే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్… షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.. ఇస్రో చేపట్టనున్న జి ఎస్ ఎల్ వి ఎఫ్-10 ప్రయోగం వల్ల మరో ప్రయోగం వాయిదా పడే పరిస్థితి నెలకొంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి వచ్చే నెల 18న చేయతలపెట్టిన పీఎస్ఎల్వీ-సి 49 ప్రయోగం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు షార్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం
చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల మార్చి18 న పి ఎస్ ఎల్ వి సి -49 ద్వారా
రీశాట్ ఉపగ్రహాన్ని కక్ష్య లోకి పంపాల్సి ఉంది.
ప్రస్తుతం శాస్త్ర వేత్తలు జి ఎస్ ఎల్ వి ఎఫ్-10 పై దృష్టి సారించినందున పీ ఎస్ ఎల్ వి రూపకల్పనలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో జి ఎస్ ఎల్ వి ప్రయోగం ఉన్నందున పీ ఎస్ ఎల్ వి సి-49 ప్రయోగం ఏప్రిల్ మొదటి వారంలో చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.