అతనొక మోతుబారి రైతు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కడు పేదరికంలో ఉన్నాడు. బతుకు మరింత భారమై ఉన్న భూములను, ఇతర స్థిరాస్తులను అమ్ముకుంటున్నాడు. అప్పులు సైతం భారీగానే చేశాడు ఆ రైతు. అయితే, రెండేళ్ల తరువాత తిరిగి చూస్తే.. అంతకు ముందు ఉన్న పరిస్థితులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రస్తుతం అతనిని చూస్తే.. ఇదివరకూ తాము చూసిన రైతేనా అనుకుంటారు.!
ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అపర కుబేరుడై.. ఇది వరకూ తాను అమ్ముకున్న భూములను స్థలాలను తిరిగి కొనుక్కుంటున్నాడు. దానికి తోడు అదనంగా భారీ విలువ గలిగిన భూములు, బంగ్లాలను కూడా కొనుక్కొంటున్నాడు. అయితే, కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఉన్న ఓ సాధారణ రైతు.. అపర కుబేరుడు కావడం ఎలా జరిగిందని ఆశ్చర్య పోతున్నారు. ఆయనకు ఎదో అదృష్టం కలిసివచ్చిందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
అయితే, ఈ విషయం తెలిసిన ఐటీ అధికారులు.. ఆ రైతు ఎలా డబ్బును సంపాదిస్తున్నాడనీ, ఏవైనా అవకతవకలకు పాల్పడుతున్నాడా? అనే నేపథ్యంలో ఆ రైతు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణపురం గ్రామానికి చెందిన మోతుబారి రైతు సుగీష్ చంద్రన్ కథ ఇది. అయితే, కొన్నేళ్ల కిందట వీరికి భారీగానే ఆస్థులు ఉన్నప్పటికీ.. కాల క్రమంలో అన్నీ కరిగిపోయి.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందలు పడుతున్న పేద రైతుగా మారాడు.
అయితే కేవలం రెండేళ్లలోనే ఆ రైతు సంపద రికార్డు స్థాయిలో పెరిగినట్టు ఐటీ అధికారుల పరిశోధనలో తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మోతుబారి రైతు సుగీష్ చంద్రన్ ఇంట్లో దాడులు నిర్వహించారు. పదుల సంఖ్యల కార్లలో ఎక్కువ మంది అధికారులు వచ్చి ఈ దాడుల్లో పాల్గొనడం గమనార్హం. ఆ రైతు సంపద అమాంతం పెరగటానికి కారణం ముంబయిలో పనిచేస్తున్న రైతు కుమారుడు, కూతురు, అల్లుడుల హస్తమే కారణమని అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే, సోదాలు, ఆ రైతు ఆస్తులు భారీగా పెరగటానికి గల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?