అత్యధిక వేగంతో వెళ్లే.. హై కెపాసిటీ కలిగిన మోటార్ సైకిల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వాటిపై దూసుకెళ్లవచ్చు. అయితే అలాంటి బైక్లు నిజానికి ఇండియన్ రోడ్లపై పనికిరావు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోని ఆ ఐటీ ఉద్యోగి తన 1000 సీసీ బైక్పై గంటకు సుమారుగా 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. అలా వెళ్తుండడాన్ని రికార్డు కూడా చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి ముణియప్ప (29) తన యమహా 1000 సీసీ బైక్పై అక్కడి ఓ ఫ్లై ఓవర్పై గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. ఆ సమయంలో తన హెల్మెట్కు పెట్టుకున్న ఓ కెమెరాతో వీడియో తీశాడు. అనంతరం దాన్ని తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో అతను ఎంతో వేగంగా అనేక వాహనాలను చాలా ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. అది అక్కడి ట్రాఫిక్ పోలీసుల కంట బడింది. ఇంకేముంది.. వెంటనే వారు ఆ బైక్ నడిపిన వ్యక్తి ఎవరు.. అని ట్రేస్ చేశారు.
Bengaluru man touches 299 kmph in his Yamaha 1000 cc bike on Electronic City flyover during #lockdown. CCB cops trace him, slaps case for rash driving @XpressBengaluru @santwana99 pic.twitter.com/OjvThHNVnC
— MG Chetan (@mg_chetan) July 21, 2020
ముణియప్పకు చెందిన ఇన్స్టాగ్రాం ఖాతాను పరిశీలించి అతని మొబైల్ నంబర్ను పోలీసులు ట్రేస్ చేశారు. చివరకు అతన్ని వారు పట్టుకుని అరెస్టు చేశారు. బైక్ను సీజ్ చేశారు. ప్రమాదకరంగా, అత్యంత వేగంగా బైక్ నడిపినందుకు అతనిపై కేసులు నమోదు చేశారు. అయితే బెంగళూరులో లాక్డౌన్ అమలులో ఉన్నందున ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందని, దాన్ని అదునుగా తీసుకున్న ముణియప్ప ఏదో సాహసం చేయాలని చెప్పి అలా బైక్పై వేగంగా వెళ్లాడని.. పోలీసులు తెలిపారు. ఏమైతేనేం.. చివరకు అతను పోలీసులకు దొరికిపోయాడు. అతను ఆ వీడియోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయకపోయి ఉంటే అతను దొరికేవాడు కాదని పోలీసులు తెలిపారు.