దేనినైనా సరే కొంత పరిమితి వరకూ వాడితేనే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ మరి దారుణంగా అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టుగా అతిగా వాడితే అనర్థాలు తలెత్తడం ఖాయం. ఈ విషయంలో మరీ ముఖ్యంగా చెప్పుకొవాల్సినవి ఔషధాల గురించే. వీటిలోని యాంటీబయాటిక్స్ విషయంలోనూ పైన చెప్పిన విషయం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే యాంటీ బయాటిక్స్ అత్యంత ప్రమాదరకమైన సూక్ష్మ క్రిముల వినాశకాలుగా పనిచేస్తాయి.
అందుకే ఈ మధ్య కాలంలో యంటీబయటిక్స్ వినియోగం మరింత ఎక్కువవుతోంది. జలుబు, దగ్గు, వైరస్ ఇన్ఫెక్షన్లు, చిన్న చిన్న గాయాలైతే కూడా యాంటీ బయటిక్స్ వాడేస్తున్నారు. దీని కారణంగా శరీరం ఆయా సాధారణ వ్యాధులను సహజంగానే తట్టుకునే రోగనిరోధక వ్యవస్థను కోల్పోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) హెచ్చరిస్తున్నది. మరీ ముఖ్యంగా అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే యాంటీబయటిక్స్ పై అవగాహన కార్యక్రమాలను ఈ నెల 18 నుంచి 24 నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా యాంటిబయటిక్ ఔషధాలపై ప్రచారం కల్పించడంతో పాటు వాటిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన ఓ నివేదిక వివరాల గమనిస్తే.. 2001 నుంచి 2015 మధ్య కాలంలో భారత్లో పలు రకాల యాంటీ బయటిక్స్ వాడకం గణనీయంగా పెరిగింది. అది రికార్డు స్థాయిలో 85 లక్షల యూనిట్ల నుంచి 1.32 కోట్ల యూనిట్లకు పెరిగింది. వీటిని అతిగా వాడకం వల్ల వాటి పనితీరు సరిగ్గా లేని కారణంగా భారత్లో ప్రతియేటా ఏడు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండగా.. అన్నీ దేశాల్లో కలిపి దాదాపు కోటి మందికి పైగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
దీనికి గల కారణాలను గురించి ప్రస్తావిస్తూ.. మనం తీసుకునే మాంసహార జీవులను పెంచడానికి అధిక మొత్తంలో యాంటీ బయటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా మనం వాటిని తీసుకోవడంతో వాటి ప్రభావం మనంపై పడి పనిచేయడంలోనూ ఆ ఔషధాలు ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సార్లు అవసరం లేకున్న యాంటీ బయటిక్స్ ను వైద్యులు సూచించడం కూడా దీనికి కారణమని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మరికొందరైతే వైద్యులను సంప్రదించకుండానే యాంటీబయటిక్స్ ను వాడుతుంటారు. ఈ విధంగా చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
కాబట్టి యాంటీ బయటిక్స్ ను తీసుకునే విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. అలాగే, వైద్యుల సంప్రదింపులతో పాటు, డాక్టర్ల చీటి లేకుండా యాంటీబయటిక్స్ అమ్మకాలను నియంత్రించాలి. వీటిని తీసుకోవడంలో ఒకటికి రెండు సార్లు వైద్యుల సలహాలు తీసుకోవాలి. కరోనా విజృంభణ నేపథ్యంలోనూ వీటి వాడకం చాలా వరకూ పెరిగిందనీ, ఇది చాలా ప్రమాదకరమైన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే… కరోనా సోకిన తర్వత ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నప్పటికీ.. ఆ తరువాత వచ్చే ఇన్ఫెక్షన్లకు యాంటీ బయటిక్స్ ప్రభావం చూపని పరిస్థితికి దారి తీయవచ్చు. దీనిని ప్రధాన కారణం యాంటీ బయటిక్స్ ను అతిగా వాడటమేనని అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.