Breaking: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేంద్రంలోని బిజెపి దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందంటూ తీరు స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐటి అధికారుల బృందం పక్క సమాచారంతో మంత్రి పిఏ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. నల్గొండ పట్టణంలోని తిరుమల నగర్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఐటీ అధికారులు వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే ప్రభాకర్ రెడ్డి తన నివాసానికి చేరుకోగా అప్పటికే ఐటీ అధికారులు అతని ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు లభించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పూర్తి వివరాలు తెలియ రాలేదు. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా కేంద్ర రిజర్వ్ పోలీస్ సిబ్బంది, ఐటీ అధికారులు 30 మంది పది వాహనాల్లో వచ్చి తనిఖీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుండగా సోమవారం రాత్రి మంత్రి పిఏ నివాసంతో ఐటీ అధికారులు సోదాలు జరపటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.